బ్యాంకుల మాయాజాలం..! ఇచ్చింది లక్ష.. కట్టమన్నది కోటి... ఎందుకో, ఎక్కడో తెలుసా..!!
కరీంనగర్ : కూతురి పెళ్లి ఉంది కదా అని లోన్ కోసం వెళితే అతనికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇప్పటికే తీసుకున్న లోన్ కట్టాలని చెప్పారు .. అయితే ఆ నగదు ఊహించని స్థాయిలో ఉండటంతో అతని నోట మాట రాలేదు. అయినా ఆ బ్యాంకు అధికారులపై పోరాటం చేస్తే .. తమ సంస్థ సిబ్బందే తీసుకున్నారని చావుకబురు చల్లగా చెప్పారు. అయినా కథ ముగిసిందా అంటే .. లేదు ... ఆ కథేంటో చుద్దాం పదండి.
లోన్ కోసం వెళ్తే..
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివపల్లికి చెందిన రవీందర్ రైతు. ఆయనకు మూడెకరాల పొలం ఉంది. అది ఆయన భార్య పేరు మీద ఉంది. 2016లో భార్య పేరు మీద లక్షా 60 వేల రూపాయలు లోన్ తీసుకున్నారు రవీందర్. అయితే దానికి సంబంధించి నెలవారీగా ఈఎంఐ కూడా చెల్లిస్తున్నారు. ఇంతవరకు ఓకే.. అయితే ఇటీవల రవీందర్ కూతురు పెళ్లి నిశ్చయమైంది. మళ్లీ ఎవరినో అప్పు అడగడం ఎందుకు అనుకుని బ్యాంకులో లోన్ తీసుకుందామని రవీందర్ భావించారు. పాత బ్యాంకుకెళితే ఆయనకు కళ్లు చెమర్చాయి.
గుండె పగలింది...
హుజూరాబాద్ మండలం సింగపూర్ వద్ద ఓ ప్రైవేట్ బ్యాంకులో గతంలో లోన్ తీసుకున్నారు రవీందర్. మళ్లీ అప్పు కోసం లోక్ కోసం బ్యాంకుకెళ్లారు. తర్వాత ఖాతా పరిశీలించి .. ఇదివరకు తీసుకున్న లోన్ కట్టాలని సూచించారు. ఎంత అని ఆరా తీస్తే కోటి యాభై లక్షలు అని చెప్పడంతో గుండెపగిలినంత పనైంది. అదేంటి అని కాసేపు నోట మాట రాలేదు. ఎలాగోలా గుండె ధైర్యం చేసుకొని బ్యాంకు అధికారులను అడిగారు. గట్టిగా అడిగితే తప్ప ఆ బ్యాంకు మేనేజర్ నోరు తెరవలేదు. మీ ఖాతా నుంచి లోన్ తమ సిబ్బందే తీసుకున్నారని చావుకబురు చల్లగా చెప్పారు. అదేంటి తన ప్రమేయం లేకుండా ఎలా తీసుకుంటారని ప్రశ్నించగా.. నీళ్లు నమలారు. ఏమీ కాదు అని భరోసా ఇచ్చారు. అయినా రవీందర్ .. అనుమానం తీరలేదు. ఒకవేళ మీరు ఆ లోన్ కడితే ఓకే .. మరి కట్టకుంటే ఏంటీ పరిస్థితి అని అడిగారు. సిబ్బంది కట్టకుంటే మీరు కట్టుకోవాలని చెప్పారు. దీంతో అతనికి చల్లగా చెమటలు వచ్చాయి.
న్యాయం చేయరు..!!
తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తన ప్రమేయం లేకుండా లోన్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాను తీసుకుంది లక్ష రూపాయలైతే .. కోటి రూపాయలు కట్టమనడం ఏంటని బాధితుడు రవీందర్ వాపోయారు. అంత డబ్బు ఎక్కడినుంచి కట్టాలని ప్రశ్నించారు. ప్రైవేట్ బ్యాంకు అధికారులు తీరు సరికాదని మండిపడ్డారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.