భారత్ బంద్... కరీంనగర్లో ఉద్రిక్తత.. టీఆర్ఎస్-కాంగ్రెస్ తోపులాట...?
కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారత్ బంద్ ఉద్రిక్తతకు తెరలేపింది. బంద్లో పాల్గొనేందుకు మంగళవారం (డిసెంబర్ 8) ఉదయం టీఆర్ఎస్,కాంగ్రెస్ పక్షాలు రోడ్డెక్కాయి. కరీంనగర్ బస్టాండ్ ఎదటు రెండు పార్టీలు నిరసనలకు దిగాయి. అయితే బంద్లో టీఆర్ఎస్ పాల్గొనడంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అభ్యంతరం చెప్పడంతో టీఆర్ఎస్ నేతలు ఆయన్ను ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని... అది కాస్త తోపులాటకు దారితీసింది.
టీఆర్ఎస్పై మండిపడ్డ పొన్నం
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కరీంనగర్ బస్టాండ్ వద్దకు చేరుకుని ఇరు పార్టీల నేతలకు సర్దిచెప్పారు. దీంతో ఉద్రిక్తతకు తెరపడింది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... బంద్లో పాల్గొనే నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. సన్న వడ్లకు మద్దతు ధర ఇవ్వని సీఎం కేసీఆర్.. భారత్ బంద్కి మద్దతు ఇవ్వడమా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు దమ్ముంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్ల లాంటివని అభిప్రాయపడ్డారు. రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా బంద్ విజయవంతమవుతుందని అన్నారు.
సూర్యాపేట,హన్మకొండల్లో ఇలా...
సూర్యాపేట జిల్లాలో స్థానిక రైతులు ఉదయాన్నే రోడ్డెక్కి నిరసనకు దిగారు. చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద రైతులు ట్రాక్టర్లను రోడ్డుపై నిలిపి నిరసనకు దిగారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరకేంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో హైవేపై ట్రాఫిక్ భారీగా స్తంభించి పోయింది.వరంగల్ జిల్లా కాజీపేటలో టీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ నేత్రుత్వంలో రైతుల ర్యాలీ ప్రారంభమైంది. ఎడ్ల బండ్లతో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వరకు ర్యాలీ చేపట్టనున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు లోకమంతా ఆందోళనలకు దిగుతున్నా కేంద్రానికి అదేమీ పట్టట్లేదన్నారు.
పెద్దపల్లి జిల్లాలో...
భారత్ బంద్లో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని బస్ డిపో ముందు ఆందోళనలో పాల్గొన్నారు. మంథని పట్టణంలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది.వర్తక వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.భారత్ బంద్ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని బూర్గుల వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రైతులతో కలసి ధర్నాలో పాల్గొంటారు. మరో మంత్రి హరీష్ రావు గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ వై జంక్షన్ వద్ద నాగ్పూర్ జాతీయ రహదారిపై నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆలంపూర్ టోల్ ప్లాజా వద్ద.. ఎమ్మెల్సీ కవిత కామారెడ్డి జిల్లాలోని టెక్రియాల్లో జరిగే నిరసనల్లో పాల్గొంటారు.