కరోనా మరణాలకు సీఎం కేసీఆరే కారణం: భట్టి విక్రమార్క నిప్పులు
కరోనా వైరస్ కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే రాష్ట్రంలో వైరస్ విజృంభిస్తోందని చెప్పారు. పరిస్థితిని మూడు నెలల ముందుగానే కాంగ్రెస్ పార్టీ హెచ్చరించిందని గుర్తుచేశారు. కానీ కేసీఆర్ సర్కార్ లెక్కచేయలేదని ధ్వజమెత్తారు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని కేసీఆర్ చెప్పారని మండిపడ్డారు. ఇప్పుడెమో ఫాంహౌస్కు పరిమితం అయ్యారని మండిపడ్డారు. ఆయన గురువారం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.
కరోనా వ్యాధితో పేదలు పిట్టల్లా రాలిపోతున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. వారి మరణానికి సీఎం కేసీఆరే కారణమని ఆరోపించారు. వైద్యారోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గం హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రి అధ్వానంగా ఉందన్నారు. ఇక మిగతాచోట్ల ఆస్పత్రుల తీరు ఆ దేవుడికే తెలియాలని చెప్పారు. ఇటు జమ్మికుంట సర్కార్ దవాఖానాలో సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని చెప్పారు.
ప్రభుత్వ తప్పులకు సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రవీణ్ యాదవ్ అనే ఉద్యోగి మరణానికి సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రం ఏపీ కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చింది కదా అని ప్రశ్నించారు. మరీ ధనిక రాష్ట్రం తెలంగాణలో ఎందుకు చేర్చడం లేదన్నారు. పేదలకు ఉచితంగా కరోనా వైద్యం చేయాలన్నారు.