బావ అని నమ్మితే.. సులభ్ కాంప్లెక్స్లో అబార్షన్..!
వేములవాడ : బంధువు అవుతాడు.. వరుసకు బావ అవుతాడు.. ఇంకేముంది ఆ అమాయకురాలు గుడ్డిగా నమ్మేసింది. ఆమె బావ మాత్రం అలుసుగా తీసుకున్నాడు. చనువుగా ఉంటోందని శారీరకంగా లోబర్చుకున్నాడు. బావే కదా లగ్గం చేసుకుంటాడని ఆమె నమ్మింది. దాంతో వీలుచిక్కినప్పుడల్లా లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. ఆ క్రమంలో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది.
అయితే వివాహం చేసుకోవాలని బాలిక తల్లిదండ్రులు పట్టుబడితే కాదు పొమ్మన్నాడు. అంతేకాదు గుట్టుచప్పుడు కాకుండా సదరు బాలికకు గర్భస్రావం చేయించే ప్రయత్నం చేశాడు ఆ కామాంధుడు. ఆ క్రమంలో సులభ్ కాంప్లెక్స్లో గర్భస్రావం అయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
అనంతలో గ్యాంగ్ వార్ కాదు.. గ్రౌండ్ లొల్లిలో సంచలన నిజాలివే..!
బావ అని నమ్మితే గర్బవతిని చేశాడు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం వెలుగుచూసింది. వరుసకు బావయ్యే వ్యక్తితో చనువుగా ఉన్న పాపానికి 15 ఏళ్ల మైనర్ బాలికను లోబర్చుకున్నాడు. 23 సంవత్సరాల రెవెల్ల సాయి అనే యువకుడు కొంత కాలంగా ఆ బాలికను శారీరకంగా వాడుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో సదరు బాలిక కూడా అడ్డుచెప్పలేదని తెలుస్తోంది. దాంతో వీలుచిక్కినప్పుడల్లా ఆ అమ్మాయితో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. వేములవాడ మండలంలో జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.
గర్భం తీయించే యత్నం.. సులభ్ కాంప్లెక్స్లో గర్భస్రావం
బావే కదా అని నమ్మిన సదరు బాలికను ఆ కామాంధుడు మోసం చేశాడు. గర్భం దాల్చడంతో పెళ్లి విషయాన్ని దాటవేశాడు. అయితే తన తల్లి సాయంతో ఆ బాలికకు గర్భస్రావం చేయించేందుకు సిద్ధమయ్యాడు. ఆ క్రమంలో సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తనకు వైద్యం చేయిస్తున్నారేమోనని మరోసారి గుడ్డిగా నమ్మిన ఆ బాలిక వారి వెంట వెళ్లింది. తీరా చూస్తే గర్భస్రావం చేయిస్తున్నారని తెలిసి తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా విషయం వివరించింది.
కూతురు ఇచ్చిన సమాచారంతో సదరు ఆసుపత్రికి చేరుకున్నారు పేరెంట్స్. బంధువే కదా అని.. అయిందేదో అయింది.. పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడ్ని అడిగారు. దాంతో ఆ యువకుడు పెళ్లి చేసుకోనంటూ మొండికేశాడు. దాంతో వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఫోక్సో చట్టం కింద కేసు నమోదు
అదలావుంటే తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకునేసరికే ఆ బాలికకు ఏవో మాత్రలు వేయించారు. దాంతో పోలీస్ స్టేషన్కు వెళ్లాక తీవ్రమైన కడుపునొప్పితో బాధపడింది. అయితే పీఎస్ ఎదురుగా ఉన్న సులభ్ కాంప్లెక్స్కు వెళ్లడంతో అక్కడే తీవ్ర రక్తస్రావమై అబార్షన్ అయింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో సదరు బాలికను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అనంతరం ఆమె తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.