మేడిగడ్డ నుంచి ఇక్కడి వరకు.. గోదావరి నది సజీవం.. ధర్మపురి పర్యటనలో కేసీఆర్
జగిత్యాల : మేడిగడ్డ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. అక్కడి నుంచి జగిత్యాల జిల్లా పరిధిలోని ధర్మపురి లక్ష్మినరసింహాస్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామి వారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా ఉందని, అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేయడం హర్షణీయమన్నారు. గోదావరి నదికి వరద నీరు ఎక్కువగా వస్తే మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదని.. డైరెక్టుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నీటిని తీసుకునే ఛాన్స్ ఉందన్నారు.
లక్ష్మినరసింహా స్వామి ఆశీస్సులు
ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ పర్యటనలో భాగంగా ధర్మపురి చేరుకున్నారు. లక్ష్మినరసింహాస్వామి ఆలయానికి వచ్చిన కేసీఆర్కు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ ఆయనకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రం అందించి ఘనంగా సత్కరించారు. కేసీఆర్ వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.
కశ్మీర్ బిల్లును వ్యతిరేకించే నేతలు దేశద్రోహులే.. లోక్సభలో టీఆర్ఎస్ సంచలన వ్యాఖ్యలు
అక్కడి నుంచి ఇక్కడిదాకా గోదావరి సజీవంగా
మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా ఉందన్నారు కేసీఆర్. ఆ మేరకు గోదావరి అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేస్తోందని వెల్లడించారు. సజీవ గోదావరిని అందించిన నీటిపారుదల శాఖ అధికారులకు అభినందనలు తెలిపారు. స్వామివారి దర్శనానంతరం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడుతూ.. గోదావరి నదిలో దాదాపు 100 టీఎంసీల నీరు 250 కిలోమీటర్ల మేర నిలిచిందని.. అది ఎవరూ ఊహించని ఘనత అని చెప్పుకొచ్చారు. అనుకున్న దాని కంటే బ్రహ్మాండంగా ప్రాజెక్టులు తయారైనయని వివరించారు. తెలంగాణ భవిష్యత్ కోసం శాశ్వత సాగునీటి వనరులు సమకూరుస్తున్నామని స్పష్టం చేశారు.
45 లక్షల ఎకరాలకు సాగునీరు.. కాళేశ్వరం ద్వారా సుసాధ్యం
మేడిగడ్డ దగ్గర గోదావరి బెడ్ లెవల్ 88 మీటర్లు కట్టుకున్నామని.. అదేవిధంగా 119 మీటర్ల ఎత్తులో అన్నారం బ్యారేజీ కట్టుకున్నామని తెలిపారు. 130 మీటర్ల ఎత్తులో సుందిళ్ల బ్యారేజీ నిర్మించినట్లు చెప్పిన కేసీఆర్.. ఎల్లంపల్లి ప్రాజెక్టు 148 మీటర్ల ఎత్తులో ఉందని వివరించారు. 44 ఏళ్ల సీడబ్ల్యూసీ రికార్డులను పరిశీలించి ప్రాజెక్టులు రీడిజైనింగ్ చేశామని వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా 400 టీఎంసీల నీళ్లు లభిస్తాయన్న కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టుతో 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని చెప్పుకొచ్చారు. నెలకు 60 టీఎంసీల చొప్పున 6 నెలలపాటు నీటిని ఎత్తిపోసే ఛాన్సుందని తెలిపారు. అలాగే రామగుండం నుంచి అదనంగా 4వేల మెగావాట్ల కరెంట్ వస్తుందని చెప్పారు.
మామ ఇలాకాలో అల్లుడు గారు.. కేసీఆర్ డైరెక్షన్.. హరీష్ రావు యాక్షన్..!
మిషన్ భగీరథ భేష్.. సంక్షేమ పథకాల అమలులో ముందున్నాం
గోదావరి నది మీద ఆధారపడటం తప్ప మనకు మరో మార్గం లేదన్నారు కేసీఆర్. ధర్మపురి దగ్గర ఏడాది పొడవునా గోదావరి నిండుగా ఉంటుందని.. కృష్ణాలో నీటి లభ్యత తక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. అధికారులు నాలుగైదు రోజుల పాటుగా మేడిగడ్డ నుంచి ప్రతిరోజు నాలుగైదు టీఎంసీల నీళ్లు కిందికి వదులుతున్నారని తెలిపారు.
మిషన్ భగీరథ అద్భుతమైన ఫలితాలు ఇస్తోందన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లో అందిస్తున్న నీటినే బస్తీ పేదలకు కూడా అందిస్తున్నామని వివరించారు. విద్యుత్ సమస్యను అధిగమించామని.. ఆ క్రమంలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని వెల్లడించారు.