ప్రజాక్షేత్రంలోకి ఈటల, సతీసమేతంగా ప్రచారం.. ఇంటి ఇంటికీ వెళ్లీ మరీ క్యాంపెయిన్
ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్.. ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. సతీ సమేతంగా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. శుక్రవారం నుంచి ఇంటింటా ప్రచారం చేస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. బీజేపీలో చేరకముందే.. తన ఎమ్మెల్యే పదవీకి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలో పోటీ చేసి.. భారీ విజయం సాధించాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గం బాట పట్టారు.
ఈటల పర్యటన..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆత్మగౌరవం నినాదంతో హుజూరాబాద్కు సతీసమేతంగా చేరుకున్నారు. నియోజకవర్గంలోని కమలాపూర్, జమ్మికుంట మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈటల రాజేందర్ సొంత మండలం కమలాపూర్లోని శనిగరం, గోపాలపూర్ ప్రజలు, అనుచరులతో ఈటల రాజేంధర్ సమావేశం అయ్యారు.
చైతన్యవంత నియోజకవర్గం..
ఇంటి ఇంటి ప్రచారం చేస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. హుజూరాబాద్ చైతన్య వంతమైన నియోజకవర్గం అని ఆయన చెప్పారు. ఆరు సార్లు ఎన్నికలు వస్తే అన్ని సార్లు తనను గెలిపించారని ఈటల రాజేందర్ అన్నారు. ప్రతి గ్రామంలో తనకు ఆశీర్వాదాలు అందాయన్నారు. కేసీఆర్ నీకు అన్యాయం చేశాడని అంటున్నారని చెప్పారు. చైతన్యవంతమైన హుజూరాబాద్ ప్రజలు సీఎం కేసీఆర్కు బుద్ధి చెబుతామన్నారని ఈటల రాజేందర్ తెలిపారు.
ప్రగల్బాలు కాదు.. ప్రేమ
ప్రజలు ప్రేమకు లొంగుతారు.. ప్రగల్బాలకు కాదని ఈటల రాజేందర్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏది చెప్పినా ప్రజలు నమ్మరని ఈటల రాజేందర్ అన్నారు. ప్రగతి భవన్లో రాసిస్తే చదివే మంత్రులు.. కుటుంబాల్లో ఎంత బాధపడుతున్నారో తెలుసుకోవాలని సూచించారు. రాచరికానికి తెరదించేందుకు హుజూరాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. తనకు మద్దతిస్తున్న వారిని ఇంటిలిజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మగౌరవం ఉందా అని ప్రశ్నించారు. ఆత్మగౌరవం పోరాటానికి హుజూరాబాద్ వేదిక కానుందని వివరించారు.