ఆత్మగౌరవాన్ని ఈటల తాకట్టుపెట్టారు.. హరీశ్ రావు విసుర్లు
హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం సమీపిస్తోన్న కొద్దీ మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ మరింత విమర్శల దాడిని పెంచేసింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ..ప్రచారంలో మంత్రి హరీశ్ రావు దూసుకుపోతున్నారు. అక్కడే మకాం వేసి..ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు
ఈటల రాజేందర్ కు ఆత్మగౌరవం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీయేనని, ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఆత్మగౌరవం కల్పించింది సీఎం కేసీఆర్ అని తెలిపారు. బీజేపీలో చేరి హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది ఈటల రాజేందర్ అని, పెంచి పెద్దచేస్తే... టీఆర్ఎస్ వీడి ఢిల్లీ పెద్దల ముందు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది ఆయనే అని హరీశ్ రావు విమర్శించారు.
ధరలు పెంచే వాళ్లు కావాలా...పేదలకు మేలు చేసే పార్టీ కావాలా ఆలోచించాలని ఓటర్లకు సూచించారు. దళిత బందు పేద దళితులతో స్టార్ట్ అయిందని, అన్ని కులాల్లోని పేదలకు ఇది అందుతుందన్నారు. తాము కిషన్ రెడ్డిని వేయ్యి రూపాయల ధరను 500 తగ్గించాలని సూచించండం జరిగిందని, కానీ దానికి సమాధానం ఇవ్వలేదన్నారు. ఏడాదిలో గ్యాస్ ధర 2000 చేస్తారంట అని ఎద్దేవా చేశారు. సిలిండర్ కు దండం పెట్టు, బీజేపీని బొంద పెట్టు, కారుకు ఓటు గుద్దు అనేది నినాదం కావాలన్నారు. బీజేపీ కేంద్ర మంత్రి తరుణ్ ఛుగ్ ఓ మేనిఫెస్టో రిలీజ్ చేశారని, అదోక పెద్ద జోక్ అని అభివర్ణించారు. పెన్షన్ 3 వేలు ఇస్తారని అంటున్నారని, మరి గుజరాత్ రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్ 600 మాత్రమేనని వివరించారు. వారు పాలిస్తున్న రాష్ట్రంలో ఇవ్వలేదు కాని.. ఇక్కడ 3 వేలు ఎలా ఇస్తారంటూ సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు.
Recommended Video
ఓటమి భయంతో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గిల్లికజ్జాలు పెట్టుకుని, వాళ్లపై వాళ్లే రాళ్లు వేసుకుని ఆయ్యో పాపం అని యాక్టింగ్ చేస్తున్నారని బీజేపీ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బండి సంజయ్ కరీంనగర్ ఓట్లప్పుడు ఇలానే పడిపోయి, ఆక్సిజన్ పెట్టించుకుని హాస్పిటల్ లో చేరిండని ఎద్దేవా చేశారు. అక్టోబర్ 30వ తేదీన హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12వ తేదీన రాజీనామా చేయడంతో...ఉప ఎన్నిక అనివార్యమైంది.