కరీంనగర్లో భారీ ప్రమాదం, విద్యుత్ కార్యాలయంలో ఎగిసిపడ్డ మంటలు..
తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రమాదం జరిగింది. కరీంనగర్ విద్యుత్ కార్యాలయంలో ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసపడటంతో ఆందోళన నెలకొంది. అయితే ఫైరింజిన్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. కానీ భారీగానే ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, సీపీ కమలాహసన్ రెడ్డి పరిశీలించారు.
కరీంనగర్ ఎన్పీడీసీఎల్ కార్యాలయం సమీపంలో గల ఎలక్ట్రిసిటీ స్టోర్లో శనివారం భారీగా మంటలు చెలరేగాయి. పదుల సంఖ్యలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఉన్న చోటే ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని ఎగిసిపడుతోన్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు అదుపులోకి వచ్చినా.. ఆస్తి నష్టం మాత్రం జరిగిపోయింది.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆ ప్రాంతానికి వచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రిసిటీ స్టోర్ రూమ్ ప్రక్కనే గల విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో మంటలు చెలరేగి ఉంటాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.