నన్ను కాపాడండి.. గల్ఫ్ దేశంలో కరీంనగర్ జిల్లా వాసి నరకయాతన (వీడియో)
కరీంనగర్ : సప్త సముద్రాలు దాటి బతుకు పోరాటం చేస్తున్నారు. దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతున్నారు. ఏడారి దేశాల్లో ఒంటెల కన్నా అధ్వాన్నంగా తయారవుతున్నాయి వలస జీవుల బతుకులు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై.. అరబ్ కంట్రీలకు వెళుతున్న వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. చివరకు దూరపు కొండలు నునుపు అన్న చందంగా.. గల్ఫ్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.
ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళుతున్నవారు కష్టాల కడలిలో ఎదురీదుతున్నారు. మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లా తిమ్మపురానికి చెందిన ఓ వ్యక్తి తాను పడుతున్న కష్టాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఇల్లంతకుంటకు చెందిన మరో వ్యక్తికి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది.
ఎత్తులకు పైఎత్తు.. కాంగ్రెస్, టీఆర్ఎస్ దారి పడుతోందిగా..!
గల్ఫ్ కష్టాలు
ఉన్న ఊరిలో ఉపాధి కరువై పొట్ట చేతబట్టుకుని విదేశాలకు వెళుతున్నారు తెలంగాణ బిడ్డలు. కన్నవారిని, కట్టుకున్నవారిని వదిలి వెళ్లి.. గల్ఫ్ దేశాల్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఏజెంట్ల మోసం ఓ వైపు.. సరిగా జీతాలు ఇవ్వకుండా వేధించే యజమానులు మరోవైపు.. వారిని కోలుకోకుండా చేస్తున్నాయి. నాలుగు రాళ్లు సంపాదిద్దామని దేశం కాని దేశం పోతే.. షేక్ల అరాచకత్వం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
అమాయకులే ఆసరాగా రెచ్చిపోతున్న ఏజెంట్లు.. తీయని మాటలు చెబుతారు. వేల రూపాయల ఉద్యోగమంటారు.. తీరా అక్కడకు వెళ్లాక పాచిపనో లేదంటే గొర్లు కాయడమో చేయాల్సిన దుస్థితి. తిరిగి దేశం వద్దామంటే చేసిన అప్పులు, భార్యాపిల్లల బాగోగులు గుర్తుకొస్తాయి. దాంతో ఇటు రాలేక, అక్కడ ఆ పనులు చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇల్లంతకుంట యువకుడి వీడియో వైరల్..!
గల్ఫ్ ఏజెంట్ల మోసం పరాకాష్టకు చేరింది. విదేశాల్లో ఉపాధి పేరిట అమాయకులను నిలువునా ముంచుతున్నారు. వేల రూపాయల జీతమంటూ ఊరిస్తూ.. అప్పనంగా షేక్లకు అప్పజెప్పుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటకు చెందిన మహ్మద్ సమీర్ (21సం.) ను ఏజెంట్ మోసం చేసిన ఘటన వెలుగుచూసింది.
సౌదీ అరేబియాలో ఫంక్షన్ హాల్లో పని ఉందంటూ నమ్మించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏజెంట్.. సమీర్ దగ్గర 80 వేల రూపాయలు తీసుకున్నాడు. అయితే ఆ ఉద్యోగం చేస్తే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని భావించాడు సమీర్. తీరా అక్కడకు వెళ్లాక గొర్రెల కాపరి పని అప్పజెప్పారు. నెల కిందటే అక్కడకు వెళ్లిన సమీర్.. యజమాని వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ వీడియో తీసి మిత్రుడికి పంపడంతో అది కాస్తా వైరల్ అయింది. అయితే బాధితుడి కుటుంబ సభ్యుల వినతి మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారని తెలుస్తోంది. సమీర్ను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఏజెంట్ల మోసం.. షేక్ల అరాచకం
ఇటీవల కరీంనగర్ జిల్లా తిమ్మాపురానికి చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాగే తన బాధను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అబుదాబికి రెండేళ్ల కిందట వెళ్లిన సదరు వ్యక్తిని యజమాని తీవ్రంగా వేధిస్తున్నాడని దాని సారాంశం. అతను పనిచేసే షేక్ దగ్గర వంద ఒంటెలున్నాయని.. అందులో ఒకటి అనారోగ్యంతో చనిపోవడం కారణంగా తనను చిత్రహింసలు పెట్టాడని వాపోయాడు.
యజమాని తనను ఎక్కడ పడితే అక్కడ కొట్టాడని.. దంతాలు ఊడిపోయి మాట్లాడటం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఎలాగైనా ఇండియాకు తీసుకుపోండి సారూ అంటూ దీనంగా వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కేటీఆర్ స్పందించారు. వెంటనే కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్కు ట్విట్టర్ వేదికగా విషయం ఫార్వార్డ్ చేశారు. యూఏఈలోని భారత రాయబారి ఈ విషయంలో సాయం అందించాల్సిందిగా కోరారు. అయితే కేటీఆర్ ట్వీట్కు భారత రాయబారి స్పందించారు. బాధితుడి వివరాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఏంది సుధాకరన్నా.. అప్పుడు పొగిడి, ఇప్పుడు తిట్టి.. అందుకేనా కాంగ్రెస్కు గుడ్బై..!
మోసపోని రోజులెప్పుడో..!
గల్ఫ్ దేశాల్లో ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నవారు కొకొల్లలు. ఏజెంట్లు ఇక్కడ చెప్పేటప్పుడు ఒక పని గురించి చెబుతారు. తీరా అక్కడకు వెళ్లాక మరేదో పని అప్పజెబుతారు. ఏజెంట్ల మోసాలు వెలుగుచూస్తున్నా.. వారిని నియంత్రించే వ్యవస్థ లేకపోవడం గమనార్హం. వారి మోసాలు అడపాదడపా ఒకటి రెండు కేసులకు పరిమితం అవుతాయే తప్ప పూర్తిస్థాయిలో శిక్ష పడదు. ఆడిందే ఆటగా రెచ్చిపోతున్న ఏజెంట్ల మోసాలకు చెక్ పెట్టే సమయం ఎప్పుడొస్తుందో చూడాలి. తెలంగాణ బిడ్డలు వారి బారిన పడి మోసపోని రోజులు ఎప్పుడొస్తాయో మరి.