Huzurabad : ఈటల రాజేందర్ పాదాలకు పాలాభిషేకం చేసిన అభిమానులు...
హుజురాబాద్ ఉపఎన్నిక వేళ మాజీ మంత్రి ఈటల రాజేందర్... నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజా దీవెన యాత్ర పేరిట ఆయన అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం(జులై 29) జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో పర్యటించిన ఈటలకు ఆయన అభిమానులు,మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన పాదాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా 'జై ఈటల' అంటూ నినాదాలు చేశారు.
Recommended Video
ఈటల రాజేందర్ రాజీనామా వల్లే నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా నిధులు కేటాయిస్తున్నారని ఈటల అభిమానులు అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలో సంక్షేమ,అభివృద్ది పథకాలను ప్రభుత్వం ఇంత వేగంగా అమలుచేస్తోందంటే దానికి ఈటలే కారణమన్నారు. అందుకే ఆయన పాదాలకు పాలాభిషేకం చేసినట్లు చెప్పారు. ఈ రకంగా ఈటలపై తమ అభిమానాన్ని చాటుకున్నామని చెప్పారు.
హుజురాబాద్పై ప్రభుత్వం ఫోకస్ చేసిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు చేస్తోంది. నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు,గ్రామాల్లో అభివృద్ది పనులతో పాటు నియోజకవర్గ ప్రజలకు ఫించన్లు,రేషన్ కార్డుల పంపిణీ భారీ ఎత్తున జరుగుతోంది.ప్రత్యక్షంగానో,పరోక్షంగానో నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలకు లబ్ది చేకూరేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.
నియోజకవర్గంలో దళిత ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే దళిత బంధు స్కీమ్ను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. హుజురాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ఈ పథకానికి దాదాపు రూ.2వేల కోట్లు పైనే ప్రభుత్వం ఖర్చు చేయనుంది. హుజురాబాద్పై ప్రభుత్వం ఇంత భారీగా నిధులు కుమ్మరుస్తుండటంతో... తమ నియోజకవర్గాల్లోనూ దళిత బంధు,ఇతరత్రా అభివృద్ది పథకాలు అమలుచేయాలని రాజగోపాల్ రెడ్డి లాంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే గెలిస్తే అభివృద్ది జరిగేదని... ఇప్పుడు ఎమ్మెల్యే రాజీనామా చేస్తే అభివృద్ది జరుగుతోందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా హుజురాబాద్పై టీఆర్ఎస్ పెట్టిన ఫోకస్ ఆ పార్టీని గెలిపిస్తుందా... లేక ఇదంతా మిస్ ఫైర్ అవుతుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికైతే అటు టీఆర్ఎస్,ఇటు ఈటల ఎవరికి వారు గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నారు.