సర్కార్ స్కూళ్లకు పెరుగుతున్న క్యూ.. గవర్నమెంట్ బడికి జడ్జి కూతుళ్లు
సిరిసిల్ల : వేలకొద్దీ ఫీజులు.. బండెడు పుస్తకాలు.. మోయలేని చదువు భారం. ఇదంతా కార్పొరేట్ స్కూళ్లు అనుసరిస్తున్న విద్యావిధానం. తాము చదువుకోకపోయినా.. పిల్లల్ని బాగా చదవించాలనుకునే తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూళ్ల వైపు మొగ్గుతున్నారు. అక్కడేదో మెరుగైన విద్య దొరుకుతుందని ఆశపడుతూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. అలాంటి క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉంటారని కొందరు విద్యావంతులు తమ పిల్లలను సర్కార్ బడుల్లో జాయిన్ చేస్తుండటం విశేషం.
అదే కోవలో జడ్జి తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తొమ్మిదవ అదనపు సెషన్స్ న్యాయమూర్తి జయరాజ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన ఇద్దరు కూతుళ్లను సర్కార్ బడిలో చేర్పించాలని డిసైడయ్యారు.
ట్రిపుల్ రైడింగ్ అంటూ ట్రాఫిక్ చలానా.. తీరా ఫోటో చూస్తే దిమ్మ తిరిగింది
ఆ క్రమంలో దాదాపు పది పదిహేను రోజులుగా జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్లో అందిస్తున్న విద్య గురించి ఆరా తీశారు. చివరకు అన్నీ వివరాలు సేకరించి.. గురువారం నాడు తన ఇద్దరు కూతుళ్లను ఆ స్కూళ్లో జాయిన్ చేయించారు. స్వయంగా ఆయనే వచ్చి అడ్మిషన్ తీసుకున్నారు.
జడ్జి పెద్ద కూతురు జనహిత పదవ తరగతిలో జాయిన్ కాగా.. చిన్న కూతురు సంఘహిత ఎనిమిదవ తరగతిలో చేరింది. సర్కార్ బడుల్లోనే ట్రైనింగ్ పొందిన టీచర్లు ఉంటారనే కారణంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. జడ్జి తన కూతుళ్లను తమ స్కూళ్లో చేర్పించడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి.. ఆయన నమ్మకాన్ని నిలబెడతామని చెప్పారు. పోటీ ప్రపంచంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల వైపు తల్లిదండ్రులు పరుగు తీస్తున్న వేళ.. ఇలాంటి సంఘటనలు సర్కార్ బడులను బతికిస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.