వామ్మో.. ఆటోలో 24 మంది.. ఏంది నాయనా ఇది..!
Recommended Video
కరీంనగర్ : పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడం ప్రమాదమని తెలుసు. ప్యాసింజర్ల సంఖ్య లిమిట్ దాటితే నేరమని తెలుసు. అయినా కూడా ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు లెక్క తప్పుతూనే ఉన్నారు. అటు ఆర్టీసీ సైతం ఓవర్లోడ్తో బస్సులు నడుపుతున్న సందర్భాలున్నాయి. ఆ క్రమంలో 2018, సెప్టెంబర్ నెలలో కొండగట్టు దగ్గర జరిగిన ప్రమాదంలో 65 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. అయితే తాజాగా కరీంనగర్లో ఓ ఆటోవాలా పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకున్న తీరు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఏపీ, తెలంగాణ లీడర్లకు 'నాయుడు' టెన్షన్.. ఆల్ టైమ్ రికార్డే మరి..!
ఆటోవాలా.. ఇదేందయ్యో..!
కరీంనగర్ జిల్లాలో ఓ ఆటోవాలా తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకున్న సదరు డ్రైవర్ సాబ్ అనూహ్యంగా పోలీసుల కంటపడ్డాడు. దాంతో ఆటోను ఆపిన పోలీసులు విస్తుపోయారు. సాధారణంగా ఆరుగురు ప్రయాణీకులను ఎక్కించుకోవాల్సిన ఆటోలో ఎంతమంది ఉన్నారో తెలిస్తే మీరు కూడా షాక్ తింటారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆ క్రమంలో కరీంనగర్ - తిమ్మాపూర్ మధ్య డైలీ సర్వీసుగా షేరింగ్ ఆటో తిప్పుతున్నాడు. అయితే సాధారణంగా ఆరుగురు ప్రయాణీకులను మాత్రమే ఆటోలో ఎక్కించుకోవాల్సి ఉండగా.. అతడు పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించేస్తున్నాడు.
ఆరుగురికి బదులు 24 మంది.. పోలీసుల క్లాస్..!
తాజాగా కరీంనగర్ నుంచి తిమ్మాపూర్కు ట్రిప్పు కొడుతున్న క్రమంలో పోలీసులు ఆపారు. అందులో ఉన్న ప్రయాణీకులను చూసి అవాక్కయ్యారు. దాంతో ప్రయాణీకులను దిగాల్సిందిగా కోరారు. ఆ సమయంలో ఒకటి, రెండు, మూడు అంటూ లెక్కిస్తూ పోయి.. వామ్మో అంటూ విస్తుపోయారు. ఆటోలో ఆరుగురు ప్రయాణీకులకు బదులు నాలుగింతలు అంటే 24 మందిని ఆటో ఎక్కించేశాడు అబ్దుల్.
అది చూసి షాక్ తిన్న పోలీసులు అబ్ధుల్కు క్లాస్ పీకారు. ఇంతమందిని ఎక్కించుకుని ఇలా ఓవర్లోడ్తో వెళితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది కదా అంటూ మందలించారు. దీనికి సంబంధించి పోలీసులు తీసిన వీడియోను కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భద్రత గురించి ఆలోచించకుండా ఇంతమంది ఆటోల్లో ప్రయాణించడం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.
ఆదాయ కోసం ఇలా.. ట్రిప్పుకు ఆరుగురైతే వర్కవుట్ కాదట..!
డబ్బుల కోసం నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు ప్రైవేట్ వాహనదారులు. అందుకే ఆరు మందిని ఎక్కించుకోవాల్సిన ఆటోలో ఇలా పదుల సంఖ్యలో ఎక్కిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఓవర్లోడ్తో ఇదివరకు చాలా ప్రమాదాలు జరిగిన సందర్భాలున్నాయి. అయినా కూడా జనాల్లోనూ మార్పు రావడం లేదు.
సాధారణంగా షేరింగ్ ఆటోల్లో ఓ ప్రయాణీకుడి దగ్గర దూరంను బట్టి 10 నుంచి 15 రూపాయలు ఛార్జీ చేస్తుంటారు. అలా నిబంధనల ప్రకారం ఆరుగురిని మాత్రమే ఎక్కించుకుంటే వారికొచ్చే ఆదాయం ట్రిప్పుకు 60 నుంచి 90 రూపాయలే. అదే పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకుంటే దాదాపు మూడు, నాలుగింతలు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ ఆటోలో 24 మంది ఎక్కారు.. ఆ లెక్కన చూసుకుంటే 240 - 360 మధ్య డ్రైవర్కు ఇన్కమ్ వస్తోంది. ఈ ఆశతోనే ఇలా కక్కుర్తి పడుతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆటోలో పట్టకున్నా సరే.. లోపలకు జరగండంటూ దబాయించి మరీ వీలైనంత ఎక్కువగా ప్రయాణీకులను ఎక్కించేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు సీజ్.. ఇలా చేయండి సారూ..!
జులై నెలలో జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలు అతిక్రమించిన ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు. కోరుట్ల డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సును కొడిమ్యాల గ్రామం దగ్గర ఆపి తనిఖీ చేశారు. ఆ క్రమంలో 55 మందిని ప్రయాణీకులను ఎక్కించుకోవాల్సింది పోయి పరిమితికి మించి 125 మందిని ఎక్కించుకున్నారు. రెవెన్యూ పెంచాలనే అధికారుల టార్గెట్తో డ్రైవర్, కండక్టర్ అలా చేసి ఉంటారనే టాక్ వినిపించింది. అయితే ఓవర్లోడ్ కారణంగా జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్ రావు బస్సు సీజ్ చేశారు.
కిరాక్ డ్యాన్స్.. ఆనంద్ మహీంద్రా ఫిదా.. రోబోలా మెలికలు తిరుగుతూ..! (వీడియో)
కొండగట్టు ప్రమాదం మరచిపోలేదుగా..!
2018, సెప్టెంబరులో కొండగట్టు దగ్గర జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదాన్ని ఇంకా ఎవరూ మరచిపోలేదు. దేశంలోనే అది అతిపెద్ద రోడ్డు ప్రమాదమని తేల్చారు అధికారులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం సంతాపం ప్రకటించిన సందర్భం అది. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రమాదంలో 65 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. శాఖాపరంగా ఇచ్చే అవార్డులు, రివార్డుల కోసం కక్కుర్తిపడి జగిత్యాల డిపో మేనేజర్ హనుమంతరావు డ్రైవర్లపై వత్తిడి పెంచిన కారణంగా ఆ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఆయా రూట్లలో డిజీల్ తక్కువగా వాడి ఎక్కువ ఆదాయం తెచ్చేలా డ్రైవర్లను ప్రోత్సహిస్తూ కొండగట్టు ప్రమాదానికి కారణమయ్యారనే వాదనలు వినిపించాయి. ఓవర్ లోడ్ కారణంగానే కొండగట్టు ప్రమాదం జరిగినట్లు అప్పట్లో ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆ మేరకు డిపో మేనేజర్ పై సస్పెన్షన్ వేటు పడింది.