కరీంనగర్లో టిక్టాక్.. ముగ్గురు మహిళా ఉద్యోగుల జోష్.. చివరకు..!
కరీంనగర్ : టిక్టాక్ వీడియోల సరదా కాస్తా ప్రాణాల మీదకు తెస్తోంది. అంతేకాదు జీవన పోరాటంలో మరెన్నో తలనొప్పులు తెస్తోంది. అయినా కూడా వీడియోలు తీయడం.. టిక్టాక్లో అప్లోడ్ చేయడం మాత్రం ఆపలేకపోతున్నారు జనాలు. అటు ప్రాణాలతో రిస్క్ చేస్తూ.. ఇటు జీవితంలో రిమార్క్ తెచ్చుకుంటూ లేనిపోని తంటాలు పడుతున్న సందర్భాలు కొకొల్లలు.
డ్రైవింగ్ చేస్తూ.. ఉద్యోగ వేళల్లో పనులు పక్కన పడేస్తూ.. ఇలా చాలా సందర్భాల్లో టిక్టాక్ వీడియోలు రూపొందిస్తున్నారు. ఆ యాప్కు అడిక్ట్గా మారినట్లుగా కనిపిస్తున్న ఈ తీరు అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఆ క్రమంలో తాజాగా కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం సిబ్బంది చేసిన టిక్టాక్ వీడియోలు బయటకు రావడంతో పెద్ద రచ్చయింది.
కొంపముంచుతున్న టిక్టాక్ వీడియోలు..!
ఇటీవల టిక్టాక్ వీడియోలు కొంప ముంచుతున్నాయి. కొన్ని చోట్ల సరదా కోసం వీడియోలు చేస్తుండగా ప్రాణాలు పోతున్న ఘటనలు బయట పడుతుంటే.. మరికొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆ క్రమంలో విధినిర్వహణలో పనీపాటా పక్కన పడేసి వీడియోలు చేస్తున్న ముగ్గురు మహిళా ఉద్యోగులపై వేటు పడింది.
కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు దివ్య, సమతతో పాటు ల్యాబ్ అటెండర్ జయలక్ష్మి విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించారు. డ్యూటీ సమయంలో టిక్టాక్ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేశారు. విషయం కాస్తా బయటకు రావడంతో మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. దాంతో ఆ ముగ్గురిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
సీఎం కుర్చీ కాదని.. రాజకీయాల్లో అజాత శత్రువు.. జైపాల్ రెడ్డి సుదీర్ఘ ప్రస్థానం
హెల్త్ డిపార్టుమెంట్లో కలకలం.. ముగ్గురు సస్పెండ్
ఆ ముగ్గురు మహిళా ఉద్యోగులు చేసిన టిక్టాక్ వీడియోల్లో ఒకటి బయటకొచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో వారి ఉద్యోగాలకు ఎసరు వచ్చింది. ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. ఆయన ఆదేశాల మేరకు ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామ్ మనోహర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు విచారణ చేపట్టి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.
మొన్నటికి మొన్న హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో వెలుగుచూసిన జూనియర్ డాక్టర్ల టిక్టాక్ వీడియో కూడా దుమారం రేపింది. నిత్యం రోగులతో కిటకిటలాడే గాంధీలో వాళ్లకు వీడియో తీసుకునేంత సమయం దొరికిందా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. జనాల సేవలతో ముడిపడి ఉండే ఇలాంటి చోట్ల విధుల్లో నిర్లక్ష్యం వహించడం సరికాదనే వాదనలు కూడా వినిపించాయి.
ఖమ్మం ఉద్యోగుల వీడియోలైతే ఎన్నో..!
ప్రభుత్వ కొలువులు చేస్తూ జవాబుదారీగా ఉండాల్సిన ఉద్యోగులు ఇలా కార్యాలయంలోనే వీడియోలు తీస్తుండటం చర్చానీయాంశంగా మారింది. ఇటీవల ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది టిక్టాక్ వీడియోలు బయటపడ్డాక రాష్ట్రంలో ఏదో చోట ఇలాంటి వీడియోలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అక్కడి సిబ్బంది పనిపాటను పక్కన పడేసి వీడియోలు తీసుకోవడం కోసమే ఆఫీసుకు వచ్చామన్నట్లుగా వ్యవహరించారు.
లెక్కకు మించి వారు తీసిన వీడియోలు చూస్తే విధి నిర్వహణలో వారు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించారో కళ్లకు కట్టినట్లైంది. సినిమా పాటలకు తోడు కొన్ని డైలాగులకు వారు చేసిన అభినయం చివరకు వారి ఉద్యోగాలకు ఎసరు తెచ్చేలా చేసింది. కానీ ఉన్నతాధికారులు దయతలచి కేవలం శాఖాపరమైన మార్పులతో సరిపెట్టారు. లేదంటే ఈపాటికి ఇంట్లో కూర్చునేవారు.