కరీంనగర్ స్మార్ట్ సిటీ కాదు వరస్ట్ సిటీ.. రోడ్లపై నాట్లేసి పొన్నం నిరసన
తెలంగాణ రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార పార్టీ మంత్రులు రాష్ట్ర పాలనను గాలికి వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ అభివృద్ధి కోసం మంత్రులు ఏ మాత్రం పనిచేయడం లేదని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
కరీంనగర్ జిల్లాలో రోడ్లు దారుణంగా తయారయ్యాయని, కరీంనగర్లో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని, ప్రభుత్వం పట్టించుకోలేదని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కరీంనగర్ రోడ్లపై వరినాట్లు వేసి పొన్నం ప్రభాకర్ తో పాటు కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. రోడ్డు మొత్తం గుంతల మయంగా మారి వర్షం పడితే వాహనచోదకులు నరకం చూడాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు.
టీఆర్ఎస్ మంత్రులు అసలు అభివృద్ధిని పట్టించుకోవటంలేదని, కేవలం ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. కరీంనగర్లో రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని పేర్కొన్న పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో ఉన్న రోడ్ల పరిస్థితులకు మంత్రులు, ఎంపీ దే బాధ్యత అని ఆయన మండిపడ్డారు.
కరీంనగర్ స్మార్ట్ సిటీ కాదని వరస్ట్ సిటీ అన్నారు పొన్నం ప్రభాకర్. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్ల సమస్య పరిష్కరించకపోతే త్వరలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ మిడ్ మానేరు రిపేర్పై చర్చకు తాను సిద్ధమని, ముంపు గ్రామాల ప్రజల మధ్య చర్చ పెడదామని, ప్రజల సమక్షంలో తేల్చుకుందామని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.
మిడ్మానేరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 25 టీఎంసీలు పేర్కొన్న పొన్నం ప్రభాకర్ కేవలం 15 టీఎంసీల నీరు చేరడంతోనే అర్ధరాత్రి 25 గేట్లు తెరిచి ఆదరాబాదరగా ఎల్ఎండీకి నీరు ఎందుకు విడుదల చేశారో జవాబు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిడ్మానేరు కట్ట నాణ్యతపై రాష్ట్రస్థాయి ఇంజినీర్లతో విచారణ చేయించాలని కోరారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. కట్ట నాణ్యంగా ఉంటే వెంటనే 25 టీఎంసీల నీరు మిడ్మానేరు ప్రాజెక్టులో నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్.