షాకింగ్ : లంచం అలా తీసుకుంటూ.. అంతా వెరైటీ యవ్వారమే..!
కరీంనగర్ : లంచం స్టైల్ మారింది. నోట్లు తీసుకుంటే ఏసీబీ అధికారులతో తలనొప్పిగా మారింది. అందుకే కొందరు లంచావతారాలు రూట్ మార్చారు. ఏం చేసినా తెలివిగా చేయాలనే సూత్రం వంటబట్టించుకుంటున్నారు. అందుకే చేతికి మట్టి అంటకుండా అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. లంచమంటే ఎవరైనా సరే కరెన్సీ తీసుకున్న సందర్భాలు కనిపిస్తాయి. ఆ క్రమంలో కరీంనగర్ జిల్లాలో ఓ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ నగదు రహిత లావాదేవీల విధానాన్ని వాడుకోవడం విస్మయం కలిగిస్తోంది. చివరకు ఓ లీడర్ ఇచ్చిన ఫిర్యాదుతో సదరు లంచావతారం గుట్టురట్టైంది.
లంచాలకు కొత్త భాష్యం
కరీంనగర్ జిల్లాలో ఓ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రెచ్చిపోతున్నారు. లంచాలకు కొత్త భాష్యం చెబుతూ అడ్డంగా దొరికిపోయారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్థాయే అయినప్పటికీ.. ఆయన యవ్వారం మాత్రం జిల్లా రవాణా శాఖ అధికారిని మించినట్లుగా ఉంటుందనే ఆరోపణలు కొకొల్లలు. కరీంనగర్ జిల్లాకు గత ఐదేళ్ల నుంచి పర్మనెంట్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ లేకపోవడం ఆయనకు బాగా కలిసొచ్చింది.
ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్.. కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. పని వత్తిడిలో ఆయన బిజీగా ఉండటమే ఈయనకు కలిసొచ్చింది. అంతేకాదు నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒకే ఒక్కడిగా వెలిగిపోతున్నారు. దాంతో ఆయన ఆడిందే ఆటగా సాగుతోంది వ్యవహారం.
బంగారు తెలంగాణే కాదు.. ఇది వజ్రాల తెలంగాణ..! లీడర్లు చెప్పింది కాదు.. ఇది నిజం..!!
ఒకవైపు లంచాలు.. మరోవైపు ప్రభుత్వ ఖజానాకు తూట్లు..!
మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా ఇంకా మూడేళ్లపాటు పదవీలో ఉండనున్నారు సదరు అధికారి. ఆ క్రమంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తాపత్రయంతో అందినకాడికి దండుకుంటున్నారు. అయితే ఆయన లంచం తీసుకునే తీరు ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. లంచం తీసుకోవడంలో నయా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అంతేకాదు ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తూ ఆ మొత్తాన్ని కూడా ఆయనే మింగేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కరెన్సీ నోట్లు ముట్టకుండా కొత్త దారి కనుక్కున్నారు సదరు ఎంవీఐ. బినామీ అకౌంట్లకు గూగుల్ పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్న ఉదంతం బయటపడింది. నిబంధనలు పాటించని వాహనదారుల నుంచి లంచాలు తీసుకునే క్రమంలో నగదు రహిత విధానం ఎంచక్కా ఫాలో అవుతున్నారు.
ప్రైవేట్ వ్యక్తులతో వసూళ్లు..! లీడర్ ఫిర్యాదుతో ఖేల్ ఖతం..!!
వాహనాల తనిఖీల పేరిట యధేచ్ఛగా రెచ్చిపోతున్నారు సదరు ఎంవీఐ. ఆ క్రమంలో ప్రైవేట్ వ్యక్తులను చేరదీసి వాహనాలను తనిఖీ చేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇటీవల ఓ లీడర్ నుంచి లంచం తీసుకోవడంతో ఆయన బాగోతం వెలుగుచూసింది. తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంకు చెందిన ఎంపీటీసీ భర్త అశోక్ రెడ్డి నుంచి 5 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. గూగుల్ పే ద్వారా పే చేయాలని కోరారు.
అశోక్ రెడ్డికి అనుమానం వచ్చి డీటీసీ శ్రీనివాస్కు రాతపూర్వకంగా కంప్లైంట్ చేశారు. దాంతో తీగ లాగితే డొంక కదిలిన చందంగా సదరు ఎంవీఐ లంచాల గుట్టు బయటపడింది. ఆ మేరకు డీటీసీ శ్రీనివాస్ అతడిపై చర్యలు తీసుకున్నారు. రవాణాశాఖ కమిషనర్కు సరెండర్ చేశారు.
కశ్మీర్ ఇష్యూలో పాకిస్థాన్కు ఎదురుదెబ్బ.. అంతర్జాతీయంగా సపోర్ట్ లేదంటున్న ఖురేషీ..!
గతం కూడా అవినీతిమయమేనంట..!
లంచాలు తీసుకోవడంలో కొత్త పంథా అనుసరించిన సదరు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గత చరిత్ర కూడా అవినీతిమయమేనంట. ఇదివరకు కొత్తగూడెం పరిధిలో డ్యూటీ చేసినప్పుడు ఓ వాహనదారుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అతడితో పాటు మరో ముగ్గురు సస్పెండ్ అయినట్లు సమాచారం. అయితే రాజకీయ పలుకుబడితో పాటు ఉన్నతాధికారుల అండదండలతో మళ్లీ కొలువుదీరినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలోనే ఆయన కరీంనగర్కు ట్రాన్స్ఫర్పై వచ్చినట్లు తెలుస్తోంది.