గులాబీ కోటలో ఓనర్ల చిచ్చు.. కారుకు బండి కౌంటర్..!
సిరిసిల్ల : గులాబీ కోటలో ఓనర్ల చిచ్చు మొదలైందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. హుజురాబాద్ వేదికగా గురువారం నాడు ఈటల చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈటల చేసిన వ్యాఖ్యలు దుమారం రేగేంత లోపే ఆయన మెత్తబడటం ఏంటో అర్థం కాలేదన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వస్తే బెటరని సూచించారు.
సొంతూరు చింతమడకపై ఉన్న ప్రేమ.. ముంపు గ్రామాలపై ఎందుకు లేదంటూ సీఎం కేసీఆర్ను నిలదీశారు బండి. మిడ్ మానేరు నిర్వాసితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు మిడ్ మానేరు ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులు తలపెట్టిన బహిరంగం సభలో ప్రసంగించారు. ఏది ఏమైనా మిడ్ మానేరు నిర్వాసితులకు అన్ని విధాలుగా బీజేపీ తరపున అండగా ఉంటామని ప్రకటించారు.
కరెంట్ లొల్లి : రేవంత్ రెడ్డి కామెంట్స్పై గరం గరం.. ఉద్యోగులా, రౌడీలా అంటూ మరో కోణం ..!
మిడే మానేరు నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించే వరకు జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి పోరాటం చేస్తామన్నారు. కేసీఆర్ సొంతూరు చింతమడకలో ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించడం విడ్డూరమన్నారు. అదే ముంపు ప్రాంతాల ప్రజలకు నయా పైసా ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు.
మిడ్ మానేరు నిర్వాసితుల విషయంలో కేసీఆర్ దిగి రాకుంటే ఇక ధర్నాలు అవసరం లేదని.. డైరెక్టుగా ప్రగతి భవన్ ముట్టడించి కేసీఆర్ సంగతేంటో చూద్దామని పిలుపునిచ్చారు. ఒకవేళ కేసీఆర్ గనక మిడ్ మానేరు ప్రాంతానికి వస్తే.. ప్యాకేజీతోనే రావాల్సి ఉంటుందని.. లేని పక్షంలో తమ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. చావుకు భయపడకుండా మలి దశ ఉద్యమం మొదలు పెడదామని పిలుపునిచ్చారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రతిపాదనలు పంపిస్తే తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించి తీసుకొచ్చే బాధ్యత తనదని చెప్పుకొచ్చారు.