మంత్రి పదవిపై అత్యాశ లేదు.. సామాన్యుడిగానే అందుబాటులో ఉంటా : బండి సంజయ్
కరీంనగర్ : టీఆర్ఎస్కు కలిసొచ్చిన కోటను బద్దలు కొట్టి విజయఢంకా మోగించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన మనోగతం వెల్లడించారు. మీడియా సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఎంపీగా గెలిచినంత మాత్రాన తనలో మార్పు రాదని స్పష్టం చేశారు. తన గెలుపులో మీడియా సహకారం మరువలేనిదని అన్నారు.
కేంద్ర మంత్రి పదవిపై తనకు అత్యాశ లేదని ఖరాఖండిగా చెప్పారు సంజయ్. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన కరీంనగర్ ప్రజలకు సేవ చేసుకోవడం ఒక్కటే తనకు తెలుసని వ్యాఖ్యానించారు. ప్రజలు తనను ఏ నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో తన బాధ్యత నెరవెరుస్తానని స్పష్టం చేశారు. సమస్య లేని సమాజంగా తీర్చిదిద్దాలన్నదే తన అభిమతమని వివరించారు.
67 ఏళ్లుగా నో ఎంట్రీ.. మొత్తానికి బీజేపీ బోణి కొట్టిందిగా..!
బండి సంజయ్ అంటే ఎంపీ కాదని.. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకేలాగే ఉంటానని, ప్రజల మనిషిగానే జనం మధ్య తిరుగుతానని చెప్పుకొచ్చారు. ఎంపీనంటూ అహంకారం ప్రదర్శించబోనని.. సామాన్యుడిలాగే ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులతో టచ్లో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధిలో పాలుపంచుకుంటానని తెలిపారు.
ఒకవేళ మైనార్టీ వర్గాలకు తన గెలుపుపై ఏ రకమైన ఆందోళన వ్యక్తమైనా.. అది తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అదలావుంటే ఈ నెల 29న హనుమాన్ జయంతి సందర్భంగా హిందు ఎక్తా యాత్రను చేపడతామని తెలిపారు. కరీంనగర్ ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.