నిన్న కర్నూలు.. నేడు కరీంనగర్.. నెత్తురోడుతున్న రహదారులు
కరీంనగర్ : తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడాయి. అటు కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరువకముందే.. కరీంనగర్ జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. నుస్తులాపూర్ దగ్గరలోని రాజీవ్ రహదారి రక్తసిక్తమైంది. ఆదివారం ఉదయం ఆ రూట్లో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.
ప్రమాదం గురించి విషయం తెలియగానే అక్కడి స్థానికులు సహాయకచర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పర్యవేక్షించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
ప్రేమ పెళ్లికి 'నో' చెప్పిన పెద్దలు.. నవదంపతులపై దాడి
కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన మరువకముందే.. కరీంనగర్ జాతీయ రహదారిపై జరిగిన మరో ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రహదారులపై వరుసగా నెత్తురోడుతుండటం భయాందోళన రేకెత్తిస్తోంది. కరీంనగర్ హైవే రాజీవ్ రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం కలవరం రేపుతోంది.
కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్స్ సమీపంలో తూపాన్ వాహనాన్ని ఓ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఢీకొట్టిన ఘటనలో 15 మంది దుర్మరణం చెందారు. మృతులంతా గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందినవారు. దాంతో ఆ పల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదంలో మృతులంతా పురుషులే కావడంతో వారి కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయాయి. ఈ ఘటనలో మరో ద్విచక్రవాహనదారుడు బలయ్యాడు.