కరీంనగర్ రాజకీయం.. గంగుల బీజేపీలోకి.. ఆ ప్రచారంపై గరం గరం..!
కరీంనగర్ : రాజకీయం అంటేనే ఎత్తులు, జిత్తులు, పైఎత్తులు. ప్రత్యర్థులను ఎదురుగా నిలిచి బెదిరించకుండా.. నెగెటివ్ ప్రచారంతోనూ ముప్పుతిప్పలు పెట్టొచ్చు. పొలిటికల్ ఎత్తుగడల్లో ఇదొక భాగం. ఎన్నికల వేళ ఇలాంటివి షరామామూలే. అపొజిషన్ అభ్యర్థికి దిమ్మ తిరిగేలా చెడు ప్రచారం నిర్వహించడం కామన్. అయితే టైమ్ గానీ టైములో.. ఎన్నికలు లేని సమయంలో కరీంనగర్లో రాజుకున్న చిచ్చు ఆసక్తికరంగా మారింది.
కరీంనగర్ రాజకీయమంటే గంగుల వర్సెస్ బండిలా సాగుతోంది వ్యవహారం. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన బండి సంజయ్.. టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్కు గట్టి పోటీ ఇచ్చారు. 14 వేల ఓట్లతో గంగుల విజయం సాధించారు. అయితే ఎన్నికల వేళ వారిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఆ సీన్ అంతా అలా ఉంటే.. తాజాగా గంగుల బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం రాజకీయ ప్రకంపనలకు కారణమైంది.
హీటెక్కిన కరీంనగర్ రాజకీయం.. బీజేపీలోకి గంగుల..!
కరీంనగర్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ చందంగా తయారైంది ప్రస్తుత రాజకీయ పరిస్థితి. అలాంటి నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీజేపీలో చేరబోతున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన కథనం పొలిటికల్ హీట్ పెంచింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో గంగుల బీజేపీలో నిజంగా చేరుతారా.. టీఆర్ఎస్లో ఆయనకొచ్చిన కష్టమేంటనే వాదనలు తెరపైకి వచ్చాయి.
ఆ నేపథ్యంలో స్వయంగా గంగుల రంగంలోకి దిగారు. తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. సదరు యూట్యూబ్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
దళితుడి శవంతో సర్కస్ చేయాల్సి వచ్చిన గ్రామస్తులు.. బ్రిడ్జిపై నుంచి కిందకు దించి..!(వీడియో)
బీజేపీలోకి వెళ్లే టీఆర్ఎస్ నేతలు వీళ్లేనంటూ కథనం..!
ఆపరేషన్ కమలం స్పీడ్ అందుకున్న వేళ.. బీజేపీ గూటిలోకి వెళ్లే నేతలు వీళ్లే అంటూ సదరు యూట్యూబ్ ఛానల్ ఒక కథనం ప్రసారం చేసింది. అది కాస్తా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైరల్గా మారింది. ఆ వార్త కాస్తా కలకలం సృష్టించడంతో గంగుల డీజీపీతో పాటు కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేశారు. అదే క్రమంలో ఆయన అనుచరులు నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. అంతేకాదు తాను టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తి లేదంటూ గంగుల క్లారిటీ కూడా ఇచ్చారు.
న్యాయపరమైన చర్యలు తీసుకుంటా.. గంగుల కంప్లైంట్
కరీంనగర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తనపై కొందరు కావాలనే కుట్ర పన్నుతున్నారనేది గంగుల వాదన. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు కావాలని ఇలాంటి చీప్ పాలిట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సలహాలు, సూచనలతో పార్టీ పటిష్టత కోసం ఒక సైనికుడిలా పనిచేస్తానే తప్ప ఇతర పార్టీల వైపు చూసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేసే ఇలాంటి వార్తా కథనాలపై న్యాయపరమైన చరర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.
హ్యాట్రిక్ ఎమ్మెల్యేను.. అందుకే నాపై ఇలాంటి కథనాలు..!
ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరించిన గంగుల కమలాకర్ 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. తదనంతర పరిణామాలతో.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరి మరోసారి 2014లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ క్రమంలో 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయకేతనం ఎగురవేశారు. బీజేపీ నుంచి బరిలో నిలిచిన బండి సంజయ్పై 14 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే వీరిద్దరి మధ్య ఎన్నికల వేళ మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకానొక దశలో నువ్వెంతంట నువ్వెంత అనే రేంజ్లో పరస్పర దూషణలకు దిగారు.
రాములమ్మ ఎంట్రీ.. గులాబీ, కమలం మధ్య చేయి.. విషయం అదేనా?
ఎన్నికల వేళ డిష్యుం డిష్యుం.. బండి, గంగుల మధ్య మాటల యుద్దం..!
బండి సంజయ్ అంటేనే మండిపడతారు కమలాకర్. వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందనేది చాలా సందర్భాల్లో బయటపడింది. గంగుల వర్సెస్ బండిగా కరీంనగర్ రాజకీయం వేడెక్కిన సందర్భాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ అమిత్ షా సమరభేరి తర్వాత ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. గంగుల కమలాకర్ టార్గెట్గా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
గంగుల కమలాకర్ ల్యాండ్ మాఫియా, గ్రానైట్ మాఫియా, ఆయన ఇంటిపై దాడులు చేస్తే వేల కోట్లు బయటపడతాయి అంటూ బండి ఆరోపణాస్త్రాలు గుప్పించారు. ఆ క్రమంలో తన గురించి పలుచన చేసి మాట్లాడితే గుండు కొట్టించి గాడిదపై ఊరేగిస్తానంటూ గంగుల కూడా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇద్దరి మధ్య అంతటి స్థాయిలో విభేదాలు భగ్గుమంటున్న నేపథ్యంలో గంగుల చూపు బీజేపీ వైపు అంటూ వస్తున్న కథనాలు చర్చానీయాంశంగా మారాయి.