కేసీఆర్ నాలెడ్జ్ సెంటర్స్.. పెద్దపల్లి జిల్లాలో వినూత్న ప్రయోగం
కరీంనగర్ : పెద్దపల్లి జిల్లాలో స్కూల్ పిల్లల కోసం వినూత్న ప్రయోగానికి తెర తీశారు టీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ విజ్ఞాన కేంద్రం పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రఘువీర్ సింగ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కేసీఆర్ నాలెడ్జ్ సెంటర్స్ తీసుకురానున్నారు. దాంతో స్కూళ్లకే గ్రంథాలయాలు వచ్చే విధంగా ఈ కార్యక్రమం దోహద పడనుంది.
కేసీఆర్ విజ్ఞాన కేంద్రం పేరుతో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో దానికి సంబంధించిన లోగోను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొస్తున్న రఘువీర్ సింగ్ చొరవ అభినందనీయమని కొనియాడారు కేటీఆర్.
ఆర్టీసీ సమ్మె చరిత్రాత్మకం.. 25 రోజులుగా ఆందోళన పర్వం.. సకల జనభేరికి సన్నద్ధం
పెద్దపల్లి జిల్లాలో స్కూల్ పిల్లల కోసం కేసీఆర్ నాలెడ్జ్ సెంటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు రఘువీర్ సింగ్ తెలిపారు. విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆ మేరకు జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లతో పాటు ఆయా గురుకుల పాఠశాలల్లో కూడా కేసీఆర్ నాలెడ్జ్ సెంటర్స్ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గ్రంథాలయాలకు వెళ్లని ఎంతో మంది విద్యార్థులకు కేసీఆర్ నాలెడ్జ్ సెంటర్స్ ఎంతో ఉపయోగపడతాయని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ నాలెడ్జ్ సెంటర్స్ తొలుత కొన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేస్తామని.. విడతల వారీగా జిల్లాలోని అన్నీ స్కూళ్లకు విస్తరిస్తామని తెలిపారు రఘువీర్ సింగ్. ఇలాంటి మినీ లైబ్రరీలు తన ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు.. ఇలా అన్నీ పాఠశాలల్లో కేసీఆర్ నాలెడ్జ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. లోగో ఆవిష్కరణ సందర్భంగా మంత్రి దయాకర్ రావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు కార్యక్రమంలో పాల్గొన్నారు.