డాక్టర్లపై కేటీఆర్ గుస్సా.. పేషెంట్లకు సాయం చేయాలంటూ క్లాస్..!
సిరిసిల్ల : ఏరియా ఆసుపత్రి డాక్టర్ల తీరుపై స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు గరమయ్యారు. శుక్రవారం నాడు ఆసుపత్రికి ఆకస్మికంగా వచ్చి తనిఖీ చేశారు. గురువారం నాడు సరైన వైద్యం అందక గర్భిణీ చనిపోయిన ఘటనపై ఆరా తీశారు. అంతేకాదు ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
ఏరియా ఆసుపత్రి వైద్యులతో సమావేశమైన కేటీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. డాక్టర్ల తీరు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేదిగా ఉందన్నారు. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన వారిని మరోచోటకి వెళ్లమని చెప్పడం దారుణమన్నారు. నిరుపేదలు, పేదలే ప్రభుత్వాసుపత్రికి వస్తుంటారని.. అలాంటివారిని మరో ఆసుపత్రికి వెళ్లమని చెప్పడం సరికాదన్నారు. పేషెంట్లకు అలాంటి ఉచిత సలహాలు ఇవ్వకుండా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అంతేకాదు ఇక్కడ పోస్టింగ్ వస్తే డిప్యూటేషన్పై ఇతర చోటకు వెళ్లడం మంచి పద్దతి కాదని హితవు పలికారు.
స్టూడెంట్స్ "గలీజు" దందా.. చదువుకుంటూనే పాడు పని..!
డాక్టర్లు అందుబాటులో ఉండి ఆసుపత్రికి వచ్చే స్థానికులకు సాయం చేయాలని ఆదేశించారు. డాక్టర్లను తయారుచేయాలంటే ప్రభుత్వం లక్షలు ఖర్చు చేస్తోందని.. ఆ క్రమంలో మూడేళ్లు జిల్లాలో పనిచేయలేరా అంటూ ప్రశ్నించారు. గైనకాలాజిస్టు లేక గర్భిణీలకు వైద్యం అందించకుండా వెనక్కి పంపుతున్నారనే అంశంపై ఆయన స్పందిస్తూ.. వైద్యశాఖ సెక్రటరీతో ఫోన్లో మాట్లాడి నలుగురు గైనకాలాజిస్టులను నియమించాలని కోరారు.