ఐటీ టవర్ ప్రారంభం: కరీంనగర్ మారింది, ఐటీ సంస్థలకు కేటీఆర్ పిలుపు
కరీంనగర్: ఐటీ నిర్వచనం క్రమంగా మారుతోందని.. ఐటీ అంటే ఇప్పుడు ఇంటెలిజెంట్ టెక్నాలజీగా అభివర్ణించారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలని అన్నారు.
కరీంనగర్లో ఐటీ హబ్ ప్రారంభం
కరీంనగర్లో రూ. 34 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ టవర్లోని కంపెనీల్లో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో టాలెంట్ కేవలం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాల విద్యార్థులకే సొంతం కాదన్నారు.
ద్వితీయ శ్రేణి నగరాల్లోకి ఐటీ.. ఐటీ నిర్వచనం మారింది..
ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోని నైపుణ్యవంతులైన యువత ఇతర నగరాలకు వలస పోవాల్సి వస్తోందని, ఐటీ నిర్వచనం మార్చాల్సి ఉందన్నారు. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదని.. ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీ పురోభివృద్ధిపై పలు అనుమానాలు ఉండేవని.. ఇప్పుడు దేశంలో రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. అప్పట్లో ఐటీ ఎగుమతులు తక్కువగా ఉండేవని, ప్రస్తుతం ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఐటీ ఎగుమతులు రూ. 1.28 లక్షల కోట్లకు చేరాయని వివరించారు.
నేనూ కరీంనగర్లోనే చదివా.. బాగా మారింది..: కేటీఆర్
తాను కూడా కరీంనగర్లోనే చదువుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. అప్పటికీ.. ఇప్పటికీ ఈ నగరం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ఐటీ టవర్ ప్రారంభం రోజునే 432 మంది యువతకు ఉద్యోగాలు రావడం సంతోషమని తెలిపారు. ప్రభుత్వం కేవలం ఐటీ రంగానికి ప్రేరణగా ఉంటుందని.. చేసేదంతా ప్రైవేటు రంగమేనని కేటీఆర్ చెప్పారు.
ఐటీ సంస్థలు ముందుకు రావాలి..
కరోనా నియంత్రణలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాస్కులు ధరించారా? లేదా తెలుస్తుందని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నో విజయాలు సాధించవచ్చని కేటీఆ్ అన్నారు. స్థానిక యువతలో నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలన్నదే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభం కారణంగా ఐటీ టవర్లోని స్టార్టప్లకు జనవరి వరకు ఎలాంటి అద్దె లేకుండా చూస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మరో ఐటీ టవర్ కూడా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కరీంనగర్ నుంచి వెళ్లి విదేశాల్లో ఐటీ సంస్థలు నడుపుతున్న ఎన్నారైలు కరీంనగర్ ఐటీ టవర్ లో కూడా సంస్థలు స్థాపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
మరో నెలలో అందుబాటులోకి తీగల వంతెన
మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్(ఎంఆర్ఎఫ్డీపీ)లో భాగంగా రూపుదిద్దుకుంటున్న తీగల వంతెన పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. నెలరోజుల్లోగా ఈ వంతెనను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి చెప్పారు.