బీజేపీకి 150, కాంగ్రెస్ కు 110.. ఫెడరల్ ఫ్రంట్ దే కీ రోల్ : కేటీఆర్
కరీంనగర్ : కాంగ్రెస్, బీజేపీ టార్గెట్ గా మాటల తూటాలు పేల్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రానున్న ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే, యూపీఎ కూటములు కలిసినా.. ప్రభుత్వం ఏర్పాటు చేయబోవని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ క్రీయాశీలకంగా వ్యవహరించబోతోందని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు 16 ఎంపీ స్థానాలు కట్టబెడితే.. ఢిల్లీలో చక్రం తిప్పొచ్చని వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంటరీ సన్నాహాక సదస్సులో మాట్లాడిన కేటీఆర్.. పలు అంశాలపై పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు.
ఢిల్లీ కోటలో చక్రం తిప్పుదాం.. 16 మంది మనోళ్లను గెలిపిద్దాం : కేటీఆర్
ఎంత బలముంటే.. అంత పనవుద్ది
రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు కేటీఆర్. మనకు ఢిల్లీలో ఎంత బలముంటే అన్ని నిధులు తెచ్చుకోవచ్చని తెలిపారు. తెలంగాణలో 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే.. రేపు ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చుండబోతున్నారనేది ఫెడరల్ ఫ్రంట్ నిర్ణయించనుందని చెప్పుకొచ్చారు. ప్రధాని, రాహుల్ మధ్యే పోటీ ఉంటుందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభావం ఏముండదని కాంగ్రెస్ నేతలు అంటుంటే.. వారి అవివేకానికి నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు.
మోడీ ఓ భ్రమ..!
ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఓ భ్రమ తప్ప.. ఆయన దేశాన్ని ఉద్ధరించింది ఏమీ లేదని ఆరోపించారు కేటీఆర్. 2014లో మోడీని నమ్మి 283 స్థానాలు బీజేపీకి కట్టబెట్టిన ప్రజలు.. ఆయన వల్ల దేశం ముందుకు పోదనే విషయం ఇప్పుడు గుర్తించారని అన్నారు. క్రమక్రమంగా రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోతుందని చెప్పుకొచ్చారు. అలాగే కేంద్రంలో కూడా ఎన్డీయే కూటమికి ఈసారి భంగపాటు తప్పదనే విషయం వివిధ సర్వేల ద్వారా తెలుస్తోందన్నారు. ఎన్డీయేకు 150-160, యూపీఏకు 110 సీట్లు మాత్రమే దక్కుతాయనే విషయం బోధపడుతోందన్నారు. ఆ రెండు కూటములు కలిసినా.. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమే అని వ్యాఖ్యానించారు.
24 కోట్లు ఇవ్వమంటే.. 24 పైసలు కూడా ఇవ్వలే..!
తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని.. ఐరాసతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెచ్చుకున్నారని తెలిపారు కేటీఆర్. అయినా కూడా కేంద్రానికి తెలంగాణ అంటే చిన్నచూపు పోలేదని ఆరోపించారు. మిషన్ కాకతీయకు 5 కోట్లు, మిషన్ భగీరథకు 15 కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ కేంద్రానికి లేఖ రాస్తే.. కనీసం 24 పైసలు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. చేతిలో అధికారం ఉన్నోడిదే పెత్తనం నడుస్తుంది.. అందుకే మనం 16 మంది ఎంపీలను గెలిపించుకుంటే కేంద్రంలో చక్రం తిప్పొచ్చన్నారు.
టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు 16 మంది గెలిస్తే.. భావసారూప్యత కలిగిన పార్టీల నుంచి మరో 60-70 మంది కలిసి వస్తారని చెప్పుకొచ్చారు. అలా వంద మంది ఎంపీలతో మనకంటూ కూటమి ఏర్పడుతుందని అన్నారు. ఆ విధంగా భవిష్యత్తు పాలకులను నిర్ణయించే అవకాశం దక్కుతుందని తెలిపారు.
గులాములు కావాల్నా.. గులాబీ సైనికులు కావాల్నా?
కాంగ్రెస్, బీజేపీ నేతలతో ఏ పని చేతగాదని ఆరోపించారు కేటీఆర్. ఇక కాంగ్రెసోళ్ల సోదంతా ఢిల్లీలోనే ఉంటదని ఎద్దేవా చేశారు. టికెట్లు కావాలన్నా.. ఆఖరికి బాత్రూమ్ పోవాలన్నా.. ఢిల్లీ ఫైట్ ఎక్కాల్సిందే అంటూ చురకలు అంటించారు. ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గులాములు అంటూ అభివర్ణించారు. మరి అలాంటి గులాముల్ని గెలిపిద్దామా.. పనిచేసే సమర్థత ఉన్న గులాబీ సైనికులను గెలిపిద్దామా అనేది మీరే తేల్చండంటూ ప్రజాకోర్టులో బంతి పెట్టారు.
కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రైల్వే లైను గజ్వేల్ వరకు వచ్చి ఆగిపోయిందన్నారు. ఆ కూత వినిపించాలంటే.. ఓట్ల మోత మోగాల్సిందేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి చాలా ఉన్నాయని.. అవి రావాలంటే పేగులు తేగే దాకా కొట్లాడే గులాబీ సైనికులు పార్లమెంటులో ఉండాలే అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలాగైతే గెలిపించారో.. ఈసారి పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా అలాగే పార్టీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాలని కోరారు. 16 మంది మనోళ్లు ఎంపీలైతే.. తెలంగాణకు జాతీయ హోదా వచ్చి తీరుతుందని అన్నారు.