మంత్రి పదవి.. ఆదిలాబాద్ టు కరీంనగర్ షిఫ్ట్.. ఎందుకంటే..!
కరీంనగర్ : మంత్రి పదవి ఆదిలాబాద్ టు కరీంనగర్ షిఫ్ట్ అయింది. బీసీ కోటాలో అటు నుంచి ఇటుగా మంత్రి పదవి ఉద్యమాల పురిటిగడ్డకు చేరుకుంది. 2014లో తొలిసారిగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాకు సముచిత ప్రాధాన్యం కల్పించింది. ఆ మేరకు రెండు మంత్రి పదవులు కట్టబెట్టింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి రెండోసారి అధికారంలోకి వచ్చిన ఈ తరుణంలో మాత్రం ఆ జిల్లాకు ఒకటే మంత్రి పదవి ఇచ్చారు సీఎం కేసీఆర్. అదే పొరుగున ఉన్న కరీంనగర్ జిల్లా మాత్రం నాలుగు మంత్రి పదవులు కొట్టేసింది.
అయితే ఈసారి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాధాన్యం తగ్గించి కరీంనగర్ జిల్లాకు ఎందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారనేది చర్చానీయాంశమైంది. ఆదిలాబాద్ జిల్లాకు ఒకటే మంత్రి పదవి ఇచ్చి.. కరీంనగర్కు మాత్రం నాలుగు పదవులు ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటనేది హాట్ టాపికైంది.
ఆనాడు ఆదిలాబాద్కు రెండు మంత్రి పదవులు.. మరి ఈనాడు..!
తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఆనాడు ఆదిలాబాద్ జిల్లాకు రెండు మంత్రి పదవులు కట్టబెట్టిన సీఎం కేసీఆర్.. రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చాక ఆ జిల్లాకు ఎందుకు హ్యాండిచ్చారు. ఈసారి కూడా జిల్లాకు రెండు మంత్రి పదవులు పక్కా అని అందరూ భావించిన నేపథ్యంలో జోగు రామన్నను ఎందుకు పక్కన పెట్టారు. కేవలం నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డికి మాత్రమే మంత్రి పదవి కట్టబెట్టి.. బీసీ నేతగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన రామన్నకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు. ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు ఎన్నో కారణాలు సమాధానాలుగా కనిపిస్తాయి. కేసీఆర్ ఆలోచనాధోరణి డిఫరెంట్ అనే దానికి నిదర్శనంలా కనిపిస్తాయి.
టీఆర్ఎస్లో ఏం జరుగుతోంది.. మొన్న ఈటల, నేడు నాయిని.. అసంతృప్తుల సెగ వెంటాడుతోందా?
ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా.. అందుకే ఆ మూడు స్థానాలు
లోక్సభ ఎన్నికల వేళ ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. తెలంగాణలో కారు జోరు తప్ప మరేమీ కనిపించని సమయంలో కమలం పువ్వు వికసించింది. ఉత్తర తెలంగాణలో అత్యంత కీలకమైన మూడు స్థానాల్లో కాషాయం జెండా రెపరెపలాడింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటరీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం ప్రాధాన్యత సంతరించుకుంది. కారు హవాకు బ్రేకులు వేస్తూ ఆ మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులు ఎంపీలుగా గెలవడం హాట్ టాపికైంది.
టీఆర్ఎస్కు దెబ్బ
అదలావుంటే లోక్సభ ఎన్నికల వేళ కరీంనగర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు వివాదస్పదమైంది. హిందూగాళ్లు బొందూగాళ్లు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ మాటలే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటరీ స్థానాల్లో టీఆర్ఎస్కు దెబ్బ కొట్టిందనే వాదనలు లేకపోలేదు. కేసీఆర్ వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా బీజేపీ శ్రేణులు బాగా ప్రచారం చేయడంతో ఆ పార్టీకి కలిసొచ్చినట్లైంది. దాంతో మూడు ఎంపీ స్థానాలు కాషాయం కోటాలో పడ్డాయి.
మంత్రి పదవులు రాలేదని.. మైనంపల్లి అలా.. జోగు రామన్న ఇలా..!
మంత్రివర్గంలో కరీంనగర్కు పెద్దపీట
ఆ పరిణామం టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్. ఉద్యమం నుంచి ప్రభుత్వ ఏర్పాటు దాకా కరీంనగర్ ప్రజల అండదండలు టీఆర్ఎస్ పార్టీకి పుష్కలం అనేది బహిరంగ రహస్యం. అయితే కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేయడంతో ఎదురు దెబ్బ తగిలిందనే టాక్ వినిపించింది. అయితే ఆ మచ్చను తుడిపేసుకోవడానికే మంత్రివర్గ విస్తరణలో కరీంనగర్కు పెద్ద పీట వేశారనే వాదనలు లేకపోలేదు. ఈటల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్.. ఇలా ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేసీఆర్ స్ట్రాటజీ.. ఆదిలాబాద్ టు కరీంనగర్ షిఫ్ట్
ఆదిలాబాద్ జిల్లాకు ఇవ్వాల్సిన ఓ మంత్రి పదవిని అనూహ్యంగా కరీంనగర్కు షిఫ్ట్ చేయడం వెనుక కేసీఆర్ స్ట్రాటజీ ప్లే చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇదివరకు ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రిగా పనిచేసిన జోగు రామన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అదే సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు మంత్రి పదవి ఇవ్వడంతో ఆ వర్గానికి న్యాయం చేసినట్లైందనే వాదనలున్నాయి. అయితే హిందుగాళ్లు బొందూగాళ్లు అంటూ తాను చేసిన వ్యాఖ్యలతో కరీంనగర్లో కొంత నెగెటివ్ ప్రచారం జరగడం.. టీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగలడం.. వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో కరీంనగర్కు ఎక్స్ట్రా మంత్రి పదవి ఇచ్చి ఆ మచ్చను చెరిపేసుకోవడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుందని అంటున్నారు కొందరు.
పంచాయతీలకు కరెంట్ షాక్.. గ్రామాల్లో చీకట్లేనా?
మున్సిపల్ ఎన్నికలపై కన్ను.. అందుకేనా ఈ తీరు
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ జెండా రెపరెపలాడాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే వాదనలున్నాయి. ఆదిలాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి డోకా లేదు. క్షేత్ర స్థాయిలో మంచి పట్టుంది.. అలాగే జనాల్లో కూడా పార్టీ పట్ల సానుకూల వాతావరణమే కనిపిస్తోంది. అక్కడ బీజేపీ బలపడాలంటే చాలా సమయం పడుతుందనేది టీఆర్ఎస్ నేతల అంతరంగంగా కనిపిస్తోంది. అందుకే ఈసారి ఆ జిల్లాకు ఓ మంత్రి పదవి కోత పెట్టి కరీంనగర్కు కేటాయించారు. గంగుల కమలాకర్ మంత్రి పదవి ఇవ్వడంతో కరీంనగర్ ఇలాకాలో టీఆర్ఎస్కు తిరిగి పునర్ వైభవం తీసుకురావాలనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. మొత్తానికి మంత్రి పదవి ఆదిలాబాద్ టు కరీంనగర్ షిఫ్ట్ కావడంతో కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతుందా లేదా అనేది చూడాలి.