సర్పంచుల నుంచి "పైసా వసూల్"..! పోలీసుల అదుపులో "అఘోరాలు" (వీడియో)
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో నాగసాధువుల పేరిట హల్చల్ చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. గత కొద్ది రోజులుగా జిల్లాలో తిరుగుతూ.. కొత్తగా ఎన్నికైన సర్పంచులే టార్గెట్ గా డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలొచ్చాయి. మీడియాలో కథనాలు రావడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని వారితో మాట్లాడుతున్నారు.
సర్పంచులే టార్గెట్.. పైసా వసూల్
ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిన ఈ ముఠా గ్రామాల్లో తిరుగుతూ.. సర్పంచ్ ఇల్లు ఎక్కడా అంటూ నేరుగా వాళ్లింటికే వెళుతున్నారట. వారు భయపడే విధంగా నాలుగు మాటలు చెప్పి అందినకాడికి దండుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. ఆ మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కరీంనగర్ జిల్లాలో అఘోరాలు తిరుగుతున్నారంటూ మీడియాలో వార్తలు రావడంతో కలకలం రేగింది. ఇటీవల తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగడం.. కొత్త సర్పంచులు ఎన్నిక కావడం తెలుసుకున్న ఆ ముఠా సభ్యులు నాగసాధువుల పేరిట తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారు. కొత్త సర్పంచులే టార్గెట్ గా వీరు డబ్బు వసూళ్లకు పాల్పడుతుండటం గమనార్హం.
వసూళ్లు చేయలేదట..!
పోలీసుల దర్యాప్తులో మాత్రం ఈ ముఠా సభ్యులు తమకేమీ తెలియదన్నట్లుగానే చెబుతున్నారు. కుంభమేళా జరుగుతున్న దరిమిలా అన్ని ప్రాంతాలు తిరిగి మళ్లీ అక్కడకు చేరుకుంటామని వెల్లడించారు. డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారట అనే పోలీసుల ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. ఎవరైనా తమకు డబ్బులు ఇచ్చినట్లైతే.. ఆధారాలు చూపించాలనే లెవెల్లో మాట్లాడుతున్నారు. దీంతో పూర్తిస్థాయి దర్యాప్తు చేసేంతవరకు వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు పోలీసులు.
అసలు ఎందుకొచ్చినట్లు..!
కరీంనగర్ జిల్లాలో చర్చానీయాంశంగా మారిన అఘోరాల వ్యవహారాన్ని.. కొందరు వీడియోలు తీసి పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అఘోరాలు జిల్లాలో తిరుగుతున్నారనే సమాచారం జోరందుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అదలావుంటే నిజమైన నాగ సాధువులు ఇలాంటి చర్యలకు పాల్పడబోరనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి వీరు జిల్లాలోకి ఎందుకు వచ్చారు, వీరు చెప్పే సమాధానాలు కరెక్టేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూజలకోసం వచ్చామని ఒకసారి, దేశమంతటా ఇలాగే తిరుగుతామని మరోసారి చెబుతుండటం విస్మయం కలిగిస్తోంది. మొత్తానికి పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత అసలు విషయం వెలుగుచూసే అవకాశముంది.