కరీంనగర్లో రూపాయికే అంత్యక్రియలు.. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదుగా..!
కరీంనగర్ : సేవా దృక్పథంతో చేసే పనులు సంతృప్తిని ఇస్తాయి. ఆ కోవలో చాలామంది ప్రజోపయోగకరమైన పనులు చేస్తుంటారు. నామమాత్రపు ఛార్జీలు మాత్రమే తీసుకుంటూ జనాల అవసరాలు తీరుస్తుంటారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా "రూపాయి" కే వివిధరకాల సేవలందించారు. రూపాయికే కడుపు నింపిన ఎస్పీవై రెడ్డి, రూపాయికే వైద్య సేవలందించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తదితరులు జనాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
ఓ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబంలో ఎంతటి విషాదం ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఆ బాధలో అంత్యక్రియలు నిర్వహించడానికి కొంతమంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి కష్టాలకు చెక్ పెట్టడానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న కార్యక్రమం చేపట్టనుంది. రూపాయికే అంత్యక్రియలు నిర్వహించే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.
రూపాయికే రొట్టె.. రూపాయికే వైద్యం
కర్నూలు జిల్లా నంద్యాల దివంగత ఎంపీ ఎస్పీవై రెడ్డి.. రూపాయికే జొన్న రొట్టె, పప్పు అందించి పేదల కడుపు నింపారు. నంది పైపుల ఛైర్మన్గా పేరుపొందిన ఎస్పీవై రెడ్డి అనంతర కాలంలో రూపాయి రొట్టె రెడ్డిగా ప్రసిద్ధిగాంచారు. ఆయన ప్రారంభించిన ఆ పథకం.. అంతలా జనాల్లోకి వెళ్లింది. 2000 - 2003 మధ్యకాలంలో కర్నూలు ప్రాంతంతో పాటు హైదరాబాద్లో కూడా విక్రయ కేంద్రాలు నెలకొల్పారు. కార్మికులు, పేదలు, ఆటోవాలాలు, రిక్షావాలాలు.. అలా చాలామంది ఎస్పీవై రెడ్డి అందించిన రూపాయి రొట్టె రుచి చూసినవారే.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు రూపాయి డాక్టర్గా పేరు పొందారు. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ.. ఇతరుల దగ్గర నామమాత్రపు ఛార్జీలుగా రూపాయి తీసుకునేవారు. పులివెందులలో ప్రజా వైద్యశాల ఏర్పాటు చేసి విస్తృత వైద్య సేవలు అందించారు. 1978లో రాజకీయాల్లోకి రావడంతో వారి చిన్నాన్న డాక్టర్ పురుషోత్తమరెడ్డికి ఆసుపత్రి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికి కూడా అక్కడ అతి తక్కువ ఫీజులతో ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి.
సారు..
కారు..
సరే
:
మరి
ఫ్రంట్
కథ
కంచికేనా?
రూపాయికే అంత్యక్రియలు.. దేశంలోనే తొలిసారి..!
సరిగ్గా అలాంటి సేవలకు దగ్గరగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి సభ్యులు వినూత్న కార్యక్రమం తెరపైకి తెచ్చారు. స్థానికంగా ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి కార్పొరేషన్ అండగా నిలబడేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుటుంబ సభ్యులను కోల్పోయి బాధలో ఉండే వారికి భారం తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు.
నగర పరిధిలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవచ్చని చెప్పారు. రూపాయి చెల్లిస్తే నగరపాలక సంస్థ తరపున అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి కరీంనగర్లో ఇలాంటి కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు.
జూన్ 15 నుంచి అందుబాటులోకి..!
ఈ కార్యక్రమ నిర్వహణకు నగర పాలక సంస్థ కోటిన్నర రూపాయలు కేటాయించింది. రెండు వ్యాన్లతో పాటు ఫ్రీజర్ ఇతర సామాగ్రి కొనుగోలు చేస్తామన్నారు మేయర్. జూన్ 15వ తేదీ నుంచి రూపాయికే అంత్యక్రియలు కార్యక్రమం అందుబాటులోకి వస్తుందన్నారు. దీనికోసం కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామన్నారు.
శ్మశాన వాటికల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత నగర పాలక సంస్థలదేనని చెప్పుకొచ్చిన మేయర్.. అందులోభాగంగానే రూపాయికే అంత్యక్రియలు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. శ్మశాన వాటిక వరకు వాహన సౌకర్యం, దహన సంస్కారాలకు సంబంధించి ఇతర ఏర్పాట్లు అన్నింటినీ కూడా కార్పొరేషన్ భరిస్తుందన్నారు. ఇంకా కొన్ని విషయాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. మొత్తానికి రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేలా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.