తెలంగాణ వీరప్పన్పై పీడీ యాక్ట్.. కలప స్మగర్లపై యాక్షన్ ప్లాన్ స్టార్ట్
రామగుండం : అడవులను అడ్డంగా నరికితే సహించేది లేదంటోంది తెలంగాణ ప్రభుత్వం. కలప స్మగ్లర్లపై పీడీ యాక్ట్ పెడతామని ఇదివరకే హెచ్చరించింది. ఆ క్రమంలో ఏప్రిలో మొదటివారంలో కలప స్మగ్లర్ తెలంగాణ వీరప్పన్ ను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. తాజాగా పీడీ యాక్ట్ అమలు చేశారు.
ఎన్ఆర్ఐ మేనల్లుడు.. బిడ్డను మంచిగా చూస్తాడనుకుంటే..!
తెలంగాణ వీరప్పన్ పై పీడీ యాక్ట్
తెలంగాణ వీరప్పన్ గా చలామణి అవుతున్న మంథని వాసి ఎడ్ల శీనుతో పాటు ఆయ ప్రధాన అనుచరులైన కుడుదల కిషన్ కుమార్, కోరవేన మధుకర్పై.. రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ పీడీ యాక్ట్ అమలు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా అటవీ సంపదను కొల్లగొడుతున్న ఎడ్ల శ్రీను గుట్టురట్టు కావడంతో సగం అడవులు సేఫ్ అనే టాక్ వినిపిస్తోంది. ఎడ్ల శీను అండ్ కో పై పీడీ యాక్ట్ అమలు చేయడంతో మిగతా కలప స్మగ్లర్లు కూడా తమ పంథా మార్చుకుంటారనే చర్చ నడుస్తోంది.
జంగల్ బడావో.. జంగల్ బచావో
అడ్డంగా అడవులను నరుకుతూ, నాలుగు రాష్ట్రాలకు తన కార్యకలాపాలు విస్తరించిన ఎడ్ల శీను ఆడిందే ఆటగా ఇరవై ఏళ్ల నుంచి అడవి రాజుగా వెలిగిపోయాడు. తెలంగాణ వీరప్పన్ గా చలామణి అవుతూ అటవీశాఖను శాసించాడు. కలప స్మగ్లర్లపై పీడీ యాక్టులు పెడతామన్న సీఎం కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో.. తెలంగాణ వీరప్పన్ పోలీసులకు పట్టుబడటం చర్చానీయాంశమైంది. ఆ క్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ అమలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పీడీ యాక్ట్ తో మంచి ఫలితాలు..!
కరుడుగట్టిన కలప స్మగ్లర్ గా రామగుండం ఏరియాలో.. ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీను పేరు తెలియని వారుండరు. ఒకటి కాదు రెండు కాదు 20 ఏళ్లుగా అడవిలో చెట్లను నరుకుతూ "తెలంగాణ వీరప్పన్" గా చలామణి అవుతున్నాడు. అసలు పేరు కంటే కొసరు పేరుతోనే పిలిపించుకోవడం ఈ అడవిదొంగకు ఇష్టమట. తెలంగాణ వీరప్పన్ అంటే తెగ మురిసిపోతాడట. తెలంగాణ నుంచి అడవి దొంగగా నేర ప్రస్థానం మొదలు పెట్టిన ఎడ్ల శ్రీను అలియాస్ తెలంగాణ వీరప్పన్.. అంచెలంచెలుగా పొరుగు రాష్ట్రాలకు తన కార్యకలాపాలు విస్తరించాడు.
అడవుల్లో టేకు చెట్లను అక్రమంగా నరుకుతూ.. వాటిని పట్టణాలు, నగరాలకు తరలించి అమ్మి పెద్దమొత్తంలో సొమ్ము చేసుకునేవాడు. అటవీశాఖ అధికారులకు భారీ స్థాయిలో లంచాలు ఇస్తూ, రాజకీయ నేతల అండదండలతో రెచ్చిపోయాడనే ఆరోపణలున్నాయి. అటవీప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాల్లో దాదాపు 2 వేల మంది అనుచరులను ఏర్పాటు చేసుకుని దొంగ కలప దందా యధేచ్ఛగా చేశాడు. అయితే పోలీసులకు చిక్కడంతో.. 20 ఏళ్ల పాటు అడవి రారాజుగా వెలిగిపోయిన తెలంగాణ వీరప్పన్ శకం ముగిసింది.