తహసీల్దార్ ఆఫీస్ సిబ్బందిపై పెట్రోల్ చల్లిన రైతు.. కరీం నగర్ లో కలకలం
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తహసిల్దార్ విజయ రెడ్డి సజీవ దహనం ఘటన ఇంకా మర్చిపోలేదు. తాజాగా మరో తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్ తో వెళ్ళిన ఓ రైతు అక్కడ సిబ్బందిని భయాందోళనకు గురి చేశారు. అక్కడ ఆఫీసు సిబ్బందిపై పెట్రోల్ చల్లిన రైతు చేసిన పని తెలంగాణ రాష్ట్రంలో కలకలంగా మారింది.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు చేసిన పని అందర్నీ షాక్ కు గురి చేసింది. తన భూమి పట్టా కోసం చాలా రోజుల నుండి తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్న కనకయ్య అనే రైతు రెవెన్యూ కార్యాలయ సిబ్బందిపై పెట్రోల్ చల్లాడు. సీనియర్ అసిస్టెంట్ రామచందర్, వీఆర్వో అనిత, కంప్యూటర్ ఆపరేటర్ జగదీశ్, అటెండర్ దివ్యపై పెట్రోల్ పోశాడు . భూమి పట్టా మంజూరు చేయట్లేదని, అందుకే పెట్రోల్ తెచ్చానని ఆ రైతు పేర్కొన్నాడు .తనను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు .
ఇక చిగురుమామిడి రెవెన్యూ ఆఫీసులో సిబ్బందిపై రైతు పెట్రోల్ పొయ్యటంతో ఈ విషయాన్ని జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ దృష్టికి తీసుకెళ్లారు. కనకయ్యపై పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు రైతు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే రైతు చేసిన ఈ పనికి తాహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేయలేమని వారు చెప్తున్నారు.