న్యాయపరంగా అడ్డుకోవడంతో భరించలేక.. ఘాతుకానికి తెగబడ్డ కుంట శ్రీను: పోలీసులు
పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద హైకోర్టు అడ్వొకేట్ దంపతులు వామనరావు, నాగమణిల దారుణ హత్యకు కారణమైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.. కుంట శ్రీనివాస్, కుమార్, చిరంజీవిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వామనరావు దంపతుల హత్యకేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని ఐజీ నాగిరెడ్డి చెప్పారు. వామనరావు హత్యకేసులో కుంట శ్రీను ప్రధాన నిందితుడు అని వెల్లడించారు. శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ ఇతర నిందితులు పాత్రధారులు అని వివరించారు.
న్యాయపరంగా అడ్డుకోవడంతో..
వామనరావు దంపతుల హత్యకేసులో ఏ1 కుంట శ్రీను అని, ఏ2 చిరంజీవి, ఏ3 అక్కపాక కుమార్ అని ఐజీ తెలిపారు. తనకు సంబంధించిన ప్రతి అంశంలో వామనరావు అడ్డుతగులుతున్నాడనే కోపంతో కుంట శ్రీను ఘాతుకానికి పథకం రచించాడని తెలిపారు. వామనరావు, నాగమణి దంపతులు ఊళ్లో నిర్మిస్తున్న పెద్దమ్మగుడికి సంబంధించిన వివాదంలో కుంట శ్రీను కక్ష పెంచుకున్నాడని వెల్లడించారు. తనను అనేక వివాదాల్లో వామనరావు న్యాయపరంగా అడ్డుకుంటుండడంతో, భరించలేకపోయాడని అన్నారు.
భరించలేక హత్య
అక్కపాక కుమార్ ఇచ్చిన సమాచారంతో శ్రీను, చిరంజీవి ఈ హత్య చేశారని తెలిపారు. తొలుత కారుతో వామనరావు దంపతులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టారని పేర్కొన్నారు. వారు వాహనం ఆపగానే విచక్షణ రహితంగా దాడి చేశారని, శ్రీనివాస్, చిరంజీవి ఇద్దరూ కలిసి కత్తులతో నరికారని వెల్లడించారు. ముందు నాగమణిపై దాడి చేశారని, ఆపై వామనరావుపై దాడి చేశారని వివరించారు. హత్య అనంతరం నిందితులు సుందిళ్ల వైపు వెళ్లారని, రక్తంతో తడిసిన బట్టలను అక్కడి బ్యారేజిలో పడేశారని, ఆపై మహారాష్ట్ర పారిపోయారని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను పట్టుకున్నామని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. శ్రీను, చిరంజీవిని మహారాష్ట్ర సరిహద్దుల్లో పట్టుకున్నామని వివరించారు. హత్యకేసుతో సంబంధం ఉన్న అక్కపాక కుమార్ ను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు.
వాహనం సమకూర్చింది ఎవరంటే..
నిందితులకు వాహనం ఇచ్చినట్టుగా ఓ వ్యక్తి పేరు వినిపిస్తోందని, పూర్తి వివరాలు తెలుసుకుని ఆ వ్యక్తి పేరు వెల్లడిస్తామని అన్నారు. హత్యల వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్టు వెల్లడికాలేదు అని ఐజీ స్పష్టం చేశారు. ఆలయ భూమి వివాదమే ఈ హత్యకు దారితీసిందని భావిస్తున్నామని అన్నారు. రామాలయం కమిటీ విషయంలోనూ వివాదం నడుస్తోందని, కుంట శ్రీనుపై గతంలోనూ కేసులు ఉన్నాయని చెప్పారు.
కోర్టు ముందు రికార్డ్ చేసిన మొబైల్
మనోవైపు రికార్డ్ చేసిన మొబైల్ కోర్టు ముందు ఉంచగలిగితే ఈ కేసులో బలమైన సాక్ష్యం అవుతుందని హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర అన్నారు. ఇలాంటి సమయంలో పోలీసులు విట్నెస్లకు ధైర్యం, భద్రత కల్పించాలని సూచించారు. టెక్నీకల్గా చుస్తే వామనరావు చనిపోయేటప్పుడు చెప్పిన ముగ్గరు పేర్లు కూడా కోర్టు లెక్కలోకి తీసుకుంటుందన్నారు. కేసు దర్యాప్తులో వెనుక ఉండి నడిపించిన వ్యక్తులు పేర్లు కూడా బయటపడతాయని పేర్కొన్నారు. మరణ వాంగ్మూలం రికార్డ్ అయిన మొబైల్ పోలీసులు కాపాడాలని కోరారు. ఆ మొబైల్ను కోర్గు ముందు రికార్డ్ చేసిన వ్యక్తి సరెండర్ చేయాలని సూచించారు. న్యాయవాదులకు భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య కేసు..చాలా కీలకం కాబోతున్న మరణ వాంగ్మూలమని న్యాయవాది ఉమేష్చంద్ర పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన మరణ వాంగ్మూలం వీడియో ఆ వీడియో తీసిన వ్యక్తి సాక్షిగా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలన్నారు.