నాటి కరసేవకుడు..నేడు తెలంగాణ ఎంపీ: తొలి బృందంలో సభ్యుడిగా: అయోధ్య తీర్పుపై హర్షం..!
అయోధ్య తీర్పుతో ఆ అంశంతో సంబంధం ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు సంతోషంలో మునిగి తేలుతున్నారు. నాడు కరసేవకుడిగా వ్యవహరించి..తెలంగాణ నుండి వెళ్లిన ఆ యువకుడు ఇప్పుడు అదే ప్రాంతం నుండి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1992లో ఛలో అయోధ్య పేరుతో దేశ వ్యాప్తంగా కరసేవకులు రామాలయం నిర్మాణం కోసం అయోధ్యకు తరలి వెళ్లారు. దేశ వ్యాప్తంగా నాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నా.. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు సొంత జిల్లా కరీంనగర్ కావటంతో..అక్కడి నుండి కరసేవకుల బృందం బయలు దేరింది. అప్పటికే యాక్టివ్ గా ఉన్న ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నాడు బీజేపీ నాయకత్వం ఆదేశాలను పాటించారు. ప్రధాని సొంత జిల్లా నుండే తొలి కరసేవకుల బృందం బయటు దేరాలనే బీజేపీ నేతల ఆదేశాల మేరకు మొత్తం 15 మంది అక్కడి నుండి అయోధ్యకు బయల్దేరారు. అయోధ్య తీర్పుతో సంతోషంతో ఉన్న ఎంపీ బండి సంజయ్..తాను కరసేవకుడిగా ఉన్నప్పటి ఫొటోను సోషల్ మీడియాలో సన్నిహితులతో షేర్ చేసుకున్నారు. ఆ సమయంలో మొదటి నాలుగురోజులు చాయ్ బిస్కట్లతో కడుపు నింపుకొన్నామని, ఆ తర్వాత ఇతర ప్రాంతాలనుంచి కూడా భారీగా కార్యకర్తలు తరలిరావడంతో భోజన ఏర్పాట్లు చేశారని గుర్తు చేసుకొన్నారు.
నాడు..దేశ వ్యాప్తంగా సున్నిత అంశంగా మారిన రామాలయ నిర్మాణం విషయంలో..తెలంగాణ నుండి అనేక మంది 1992లో జరిగిన ఛలో అయోధ్య కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకున్నారు. అందులో కీలకం పని చేసిన ఒకరు బండి సంజయ్. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎదురు చూసిన రామాలయంకు అనుగుణంగా సుప్రీం తీర్పు ఇవ్వటంతో సంతోషంతో ఉన్నారు. బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో ఎగ్రెసివ్ పొలిటీషియన్. ఈయన కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున 2014 మరియు 2018 లలో పోటీ చేసి ఓడిపోయాడు. ఇక, గత మార్చిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచారు. ఎంపీ అయిన సమయం నుండి కేసీఆర్ ప్రభుత్వ విధానాల మీద దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కరీంనగర్ లో జరిగిన కార్యక్రమంలో పోలీసు అధికారి తనతో అనుచితంగా వ్యవహరించిన తీరు పైన నేరుగా లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. ఇక, అదే ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంకు బండ్ కు పిలుపునివ్వటంతో ద్విచక్ర వాహనం మీద ట్యాంక్ బండ్ వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా..పోలీసులు అరెస్ట్ చేసారు. ఇక, ఇప్పుడు అయోధ్య తీర్పు పైన ఎంపీ సంజయ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.