లీడరైనా సరే.. గుండాయిజం చేస్తే ఉక్కుపాదమే.. రామగుండంలో పీడీ యాక్ట్
గోదావరిఖని : లీడర్ల ముసుగులో కొందరు రెచ్చిపోతున్నారు. గుండాయిజానికి పాల్పడుతూ అమాయకులను బెదిరిస్తున్నారు. ఆ క్రమంలో రామగుండం కమిషనరేట్ పరిధిలో గొడవలకు కారణమవుతున్న మాజీ కార్పొరేటర్ కుమారుడు తోట వేణుపై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీస్ కమిషనర్ సత్యనారాయణ. రాజకీయ నాయకుడిగా చలామణీ అవుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడనే కారణంతో ఉక్కుపాదం మోపారు.
గొడవలు సృష్టిస్తూ, బెదిరింపులకు పాల్పడితే ఎవరైనా సరే వదిలిపెట్టబోమని తెలిపారు కమిషనర్. శివాజీ నగర్కు చెందిన వేణుపై ఇప్పటికే 12 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గతంలో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. అయితే లీడర్ ముసుగులో డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి.
వామ్మో డేంజర్ స్పాట్.. అక్కడకు వెళితే ప్రాణాలు పోతున్నాయి..!
వేణు ప్రవర్తనను రామగుండం కమిషనర్ సీరియస్గా తీసుకున్నారు. ఈమధ్య పలు డివిజన్లలో మాజీ లీడర్లను, యువకులను ఉసిగొల్పుతూ గొడవలకు కారణం కావడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తిందని చెప్పారు. ఆ క్రమంలోనే వేణుపై పీడీ యాక్ట్ నమోదు చేశామని తెలిపారు. ఆ మేరకు గోదావరిఖని వన్టౌన్ సీఐ పర్శ రమేశ్.. జైలులో ఉన్న తోట వేణుకు పీడీ యాక్టు ఉత్తర్వులు అందజేశారు.
కొద్దిరోజుల కిందట శివాజీ నగర్లో పూల వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారి కుటుంబాన్ని బెదిరించి 50 వేల రూపాయలు ఇవ్వాలని తోట వేణు డిమాండ్ చేశాడు. ఆ క్రమంలో వారి టేలాను ధ్వంసం చేయడమే గాకుండా ఆ కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఆ కేసులో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. ఇదివరకు కూడా అతడిపై దాడి కేసులు నమోదైనట్లు చెప్పారు కమిషనర్. అప్పట్లో ఓ విలేకరిపై కూడా హత్యాయత్నం చేశాడనే ఆరోపణలున్నాయి. చాలామంది వ్యాపారులను కూడా బెదిరించాడని కేసులు నమోదైనట్లు చెప్పారు.