ఘోర రోడ్డు ప్రమాదం: టాటాఏస్-ట్రక్కు ఢీ, ఐదుగురు మృతి, ఒకే కుటుంబానికి చెందినవారే..
కరీంనగర్: జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏఎస్ వాహనాన్ని భారీ గ్రానైట్ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురిరి తీవ్ర గాయాలయ్యాయి.
గంగాధర మండలం కురిక్యాల గ్రామం వద్ద శనివారం రాత్రి 11.30గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. కరీంనగర్ ఆస్పత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
మృతులంతా జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పూడుకు చెందిన వారని గుర్తించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులను మేకబాబు, బాణయ్య, నర్సయ్య, అంజయ్య, మేక శేఖర్గా గుర్తించారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు.
ఆటో కరీంనగర్ నుంచి పూడూరుకు వెళుతుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వాహనంలో ఇరుక్కుపోయిన ఆటో డ్రైవర్ మృతదేహాన్ని అరగంటపాటు శ్రమించి బయటకు తీసినట్లు చెప్పారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.