కరీంనగర్ జిల్లాలో విషాదం.. చిన్నారిని బలిగొన్న ఇసుక మాఫియా..!
కరీంనగర్ : ఇసుక మాఫియా కారణంగా ఓ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కరీంనగర్ రూరల్ మండలం ఎలగందులలో ఇసుక ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్.. ఇద్దరు చిన్నారులపైకి దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన జరిగింది.
మహారాష్ట్రకు చెందిన ఎల్లప్ప కమలబాయి దంపతులు ఉపాధి నిమిత్తం కొన్నాళ్ల కిందట ఇక్కడకు వచ్చారు. తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కూలి పనులకు వెళుతూ పొట్టపోసుకుంటున్నారు. వీరి పిల్లలు లక్ష్మి, రాము ఆరు బయట ఆడుకుంటుండగా ఇసుక ట్రాక్టర్ వారి పైకి దూసుకెళ్లింది. లక్ష్మి స్పాట్ లో చనిపోగా.. రాము పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రాంతంలో దాదాపు 24 గంటలు ఇసుక ట్రాక్టర్లు తిరుగుతుంటాయి. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్.. ఎల్లప్ప ఇంటి ఎదుట డంప్ చేయాల్సి ఉంది. ఆ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న లక్ష్మి, రాము పైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ట్రాక్టర్ ను రివర్స్ చేసే క్రమంలో వెనుకవైపు డ్రైవర్ చూసుకోలేదు. దాంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ గిన్నెల సంతోష్ పరారయ్యాడు. అదలావుంటే ఇసుక మాఫియానే చిన్నారి ప్రాణాలు బలి తీసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.