వామనరావు దంపతుల హత్య కేసు సీన్ రీ కన్స్ట్రక్షన్: స్పాట్లో కుంట శ్రీను అండ్ కో
అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసులో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్ను స్పాట్లోకి తీసుకెళ్లారు. హత్య కేసులో ఏ1గా గుంజపడుగుకు చెందిన కుంట శ్రీనివాస్, ఏ2గా విలోచవరానికి చెందిన శివందుల చిరంజీవి, ఏ3గా గుంజపడుగుకు చెందిన అక్కపాక కుమార్ను చేర్చిన సంగతి తెలిసిందే. వారిపై ఐపీసీ 302, 341, 120బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ మంథని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడుగా ఉండేవారు. హత్య కేసు తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు వామనరావు దంపతుల హత్య కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించే అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. కేసుకు సంబంధించి భవిష్యత్లో ఆరోపణలకు తావులేకుండా ఉండేందుకు కేసును సీఐడీకి బదిలీ చేయడమే ఉత్తమమని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంచలన కేసుల దర్యాప్తును సీఐడీకి బదిలీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు, బోధన్ స్కాం.. ఇలా తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులన్నీ సీఐడీకి అప్పగించారు. ఇప్పుడు వామన్ రావు దంపతులు హత్య కేసును కూడా సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికితోడు టీఆర్ఎస్ నేతపై ఏ-1గా ఉండటంతో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే పోలీసుల చేత దర్యాప్తు కాకుండా సీఐడీకి అప్పగించాలని అనుకుంటోంది.