షాకింగ్: పోలీస్స్టేషన్లోని మద్యం బాటిళ్లు మాయం, ఇంటి దొంగలపనేనా? ఎక్కడంటే?
కరీంనగర్: ఇప్పటి వరకు మద్యం దుకాణాల్లోనే చోరీలు జరిగినట్లు చూశాం కానీ, ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్లోనే జరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్టేషన్లోని మద్యాన్ని ఎత్తుకుపోయారు దుండగులు. ఈ ఘటన కరీంనగర్లోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.
భారత్లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..
మద్యం బాటిళ్ల చోరీ.. ఇంటి దొంగలే..
కాగా, లాక్డౌన్ సమయంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నవారిపై దాడులు చేసిన పోలీసులు సరుకును సీజ్ చేశారు. వాటిని పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. ఈ క్రమంలో కొందరు దుండగులు ఈ మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఇది ఇంటి దొంగల పనేనని అనుమానించిన పోలీసులు దర్యాప్తు చేసి.. ఇద్దరు అనుమానిత పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ జరుపుతున్నారు.
ఆరేంజ్ జోన్ కరీంనగర్.. సరి బేసి విధానం..
ఇది ఇలావుండగా, కరీంనగర్ జిల్లాను ఆరేంజ్ జోన్ గా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని దుకాణాల్లో సరి-బేసీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కమిషనర్ క్రాంతి తెలిపారు. దుకాణాలకు నెంబర్లు కేటాయించిన ప్రకారం సరి-బేసీ తేదీల్లో ఎవరికి వారు షాపులను తెరుచుకోవాల్సి ఉంటుంది.
సాయంత్రం వరకు తెరిచేందుకు అనుమతి..
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మూడు కేటగిరీలుగా దుకాణాలను విభజించినట్లు తెలిపిన కమిషనర్.. కేటగిరీ-ఏలో నిత్యావసరాలు, మద్యం, నిర్మాణ రంగానికి చెందిన దుకాణాలున్నాయని.. వీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వం చెప్పిన సమయంలో తెరవచ్చని చెప్పారు. బీ-కేటగిరీలో బట్టలు, పాదరక్షల దుకాణాలు అందుబాటులో ఉంటాయని, వీటికి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తారని తెలిపారు. ఇక కేటగిరీ-సీలో హోటళ్లు, స్కూళ్లు, థియేటర్లు తదితరాలుంటాయని కమిషనర్ చెప్పారు.
కరీంనగర్లో 19 కేసులు.. తెలంగాణలో 1096
కాగా, కరీంనగర్ జిల్లాలో మొత్తం 19 కరోనా కేసులు నమోదు కాగా, వీరిలో 15 మంది కోలుకున్నారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 1096 కేసులు నమోదు కాగా, 628 మంది కోలుకున్నారు. 439 మంది చికిత్స తీసుకుంటున్నారు. 29 మంది కరోనాబారినపడి మరణించారు.