రాజన్న ఆలయంలో అపచారం.. కైలాసగిరి చిత్రాలతో వెండిపటం...
వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో అపచారం జరిగింది. కైలాసగిరి చిత్రాలతో కూడిన వెండి పటాన్ని ఆలయ సిబ్బంది గర్భగుడిలో అమర్చడం వివాదానికి కారణమయ్యింది. ఇది ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధమని విమర్శలు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగాల్సి వచ్చింది. వెంటనే ఆ చిత్రాలను తీసివేశారు.
వరంగల్కు చెందిన ఓ వైద్యుడు ఆరున్నర కిలోల వెండితో పటాన్ని తయారు చేయించారు. పటం సరిగా అమరుతుందో.. లేదోనని వైద్యుడికి సన్నిహితుడైన ఆలయ అధికారి ఒకరు తాత్కాలికంగా బిగించి చూశారని కొందరు సిబ్బంది తెలిపారు. కాగా.. వెండి పటం విషయమై తమకు సమాచారం లేదని ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ స్పష్టం చేశారు. విషయం తమ దృష్టికి రాగానే వెంటనే తొలగించామని ఏఈవో హరికిషన్ వివరించారు.
గర్భాలయంలో వెండి పటాన్ని బిగించడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన అధికారులను నిలదీశారు. పటిష్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా మధ్య ఉన్న రాజన్న ఆలయంలోకి అధికారుల అనుమతి లేకుండా ప్రైవేటు వ్యక్తులు వచ్చి వెండి పటం ఎలా బిగిస్తారని ప్రశ్నించారు.