ఫేస్బుక్ పోస్టులతో ఔదార్యం.. ఇద్దరు మహిళలకు ఆర్థిక సాయం..!
కరీంనగర్ : సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పడమే కాదు మంచి పనులు కూడా చేయొచ్చని మరో ఘటన రుజువు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాలకు చెందిన మహిళలు అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఫేస్బుక్ పోస్ట్ చూసి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు స్పందించారు. వారిద్దరికి లక్ష పదిహేను వేల వరకు ఆర్థిక సాయం అందించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు మహిళల దీనగాథలను ఫేస్బుక్ వేదిక ద్వారా షేర్ చేశారు ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన మానెపెల్లి వరలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె భర్త ట్రాక్టర్ డ్రైవర్ కావడం.. ఆదాయం అంతంత మాత్రమే కావడంతో కుటుంబ పోషణ కూడా భారమవుతోంది. కనీసం వైద్య పరీక్షలకు కూడా డబ్బులు లేని పరిస్థితి. అలాగే ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బోదినపు లక్ష్మి కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలాకాలంగా మంచానికే పరిమితమయ్యారు. కొన్నేళ్ల కిందట భర్త చనిపోగా, ఉన్న ఒక్క కూతురు చదువు మానేసి తల్లికి సపర్యలు చేస్తోంది.
కరెంటు కష్టాలు తప్పవా.. ప్రభుత్వ బాకీలే 9 వేల కోట్లా.. డిస్కమ్లకు తిప్పలేనా?
అయితే ఆ ఇద్దరు మహిళలు పడుతున్న వేదనను అక్షర రూపం చేస్తూ జులై 4వ తేదీన ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు రేణికుంట రమేశ్. ఆ పోస్టుతో పాటే వారి బ్యాంకు ఖాతాల వివరాలు కూడా పొందుపరిచారు. దాంతో చాలామంది ఫేస్బుక్ మిత్రులు స్పందించారు. జీవనపోరాటంలో భాగంగా విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలు దాతృత్వం చాటుకున్నారు. ఆ క్రమంలో పెద్దంపేట గ్రామానికి చెందిన వరలక్ష్మి బ్యాంకు ఖాతాకు 62 వేల రూపాయలు.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి ఖాతాకు 53 వేల రూపాయలు పంపించారు. దాతలు అందించిన సాయంతో వైద్యం చేయించుకుంటామని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.