ఉద్యోగ వేటలో క్షణికావేశం.. పుణేలో కోరుట్ల టెక్కీ ఆత్మహత్య..!
కోరుట్ల : నేటి యువత చిన్న విషయాలకే కలత చెందుతున్నారు. సమస్య వస్తే పరిష్కారం దిశగా ఆలోచించాల్సింది పోయి క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. జీవితంలో కష్టసుఖాలు కామన్ అనే విషయం పూర్తిగా మరిచిపోతున్నారు. సాధించాల్సి చాలా ఉన్నా.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అప్పటివరకు విజయాలు సాధిస్తూ వచ్చినా.. ఒక్కసారి వైఫల్యం కనిపిస్తే తట్టుకోలేకపోతున్నారు. అదే క్రమంలో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మౌనిక ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది.
క్షణికావేశం..!
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పిట్ల శేషు, జ్యోతి దంపతుల కుమార్తె మౌనిక (23 సం.) బీటెక్ చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. బీటెక్ పూర్తయ్యాక పుణేలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయారు.
ఉపాధి నిమిత్తం తండ్రి గల్ఫ్ దేశానికి వెళ్లగా.. తల్లి కోరుట్లలోనే ఉంటున్నారు. అయితే పుణేలో ఉంటున్న మౌనిక ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలిసి కోరుట్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.
30 ఏళ్లుగా పిల్లల్ని విక్రయిస్తున్నా.. దేవుడి దయవల్ల ఇబ్బందులు లేవు.. ఆడియో క్లిప్ కలకలం
ఇంటర్వ్యూకు హాజరై..!
ఉద్యోగ వేటలో రెండేళ్ల కిందట పుణేకు వెళ్లారు మౌనిక. అక్కడ ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నా.. జీతం తక్కువగా ఉందంటూ ఇతర సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో వారం కిందట తాను చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేశారు. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరైనప్పటికీ మౌనికకు ఉద్యోగం రాలేదని సమాచారం. బుధవారం నాడు సాయంత్రం తల్లికి ఫోన్ చేసి మాట్లాడారు మౌనిక. అయితే ఉద్యోగం రాలేదని మౌనిక తీవ్రంగా బాధపడినట్లు తెలుస్తోంది. ఆ వత్తిడిలోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
డిప్రెషన్ కారణమా..?
బుధవారం నాడు తల్లితో మాట్లాడిన తర్వాత మౌనిక ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చిందట. దాంతో ఆందోళన చెంది కూతురు గురించి వాకబు చేయగా.. మౌనిక నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పుణే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదలావుంటే తండ్రి శేషు కూతురు మరణవార్త తెలియగానే హుటాహుటిన దుబాయ్ నుంచి కోరుట్లకు బయలుదేరి వచ్చారు. పుణే నుంచి మౌనిక మృతదేహం కోరుట్లకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.