అనుమానం పెనుభూతం : చేతబడి చేస్తోందని తల్లిని చంపిన కొడుకు
చొప్పదండి : అనుమానం పెనుభూతమై ఆ కుటుంబంలో విషాదం నింపింది. మంత్రాల నెపంతో కన్నతల్లినే కడతేర్చాడు ఓ కొడుకు. తల్లి చేతబడి చేస్తోందనే కారణంతో విచక్షణ కోల్పోయిన కొడుకు కిరాతకుడిగా మారిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలం విలాసాగర్ లో కలకలం రేగింది. కన్నతల్లిని కొడుకే కడతేర్చిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. జంగపెల్లి చంద్రవ్వ అనే 60 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కొడుకు శ్రీనివాస్ గొంతు నులిమి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
జంగపెల్లి చంద్రవ్వ - నర్సయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. కూతుళ్లకు పెళ్లిళ్లు కావడంతో వారిద్దరు అత్తగారింట్లో ఉంటున్నారు. కొడుకు శ్రీనివాస్ మాత్రం తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. అయితే ఉపాధి నిమిత్తం గల్ఫ్ కంట్రీకి వెళ్లిన శ్రీనివాస్ నాలుగు నెలల కిందటే సొంత గ్రామానికి చేరుకున్నాడు. కువైట్ నుంచి తిరిగొచ్చాక ఆ ఇంట్లో ఉంటే తనకు ఆరోగ్యం బాగుండటం లేదనే కారణంతో సమీపంలోని గంగాధరలో వేరు కాపురం పెట్టాడు. ఈనేపథ్యంలో తన ఆరోగ్యం బాగుండకపోవడానికి తల్లి మంత్రాలు చేస్తోందని అనుమానం పెంచుకున్నాడు. అంతేకాదు తనకు చేతబడి జరిగిందని భావించి విరుగుడు ప్రయత్నాలు కూడా చాలానే చేశాడు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తల్లిపై కక్ష పెంచుకున్నాడు. ఈమేరకు తల్లిని చంపాలని నిర్ణయించుకున్నాడు.
ఆదివారం విలాసాగర్ లోని ఇంటికి చేరుకున్న శ్రీనివాస్.. తల్లిని చంపడానికి ప్లాన్ వేశాడు. ఆ సమయంలో తండ్రి కూతురు దగ్గరకు వెళ్లడం శ్రీనివాస్ కు కలిసొచ్చినట్లైంది. అదే రోజు రాత్రి చంద్రవ్వ నిద్రకు ఉపక్రమించిన సమయంలో ఆమెను గొంతు నులిమి చంపాడు శ్రీనివాస్. ఏమీతెలియనట్లుగా తండ్రికి ఫోన్ చేసి.. ఆమె బల్లపై నుంచి కిందపడి చనిపోయిందని సమాచారమిచ్చాడు. అయితే చంద్రవ్వ చనిపోయిన తీరుపై అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు నిలదీయడంతో తానే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు చెప్పాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు.