సీఎం కేసీఆర్ మిత్రుడు సంపత్ కుమార్ గుండెపోటుతో కన్నుమూత...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్ననాటి మిత్రుడు తిరుకోవెల సంపత్ కుమార్(65) గుండెపోటుతో కన్నుమూశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని కొండపల్కల గ్రామంలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. బుధవారం(ఫిబ్రవరి 10) రాత్రి సంపత్ కన్నుమూయగా గురువారం అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. సంపత్ అవివాహితుడు కావడంతో ఆయన సోదరుడు అంత్యక్రియలు నిర్వహించారు.
కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం... సీఎం కేసీఆర్, సంపత్కుమార్ కలిసి సిద్దిపేటలో ఇంటర్మీడియట్ చదివారు. ఆ సమయంలో ఇద్దరూ ఒకే గదిలో ఉండేవారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. 1970లో సంపత్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ సోషియాలజీ పూర్తిచేశారు. ఆ తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్లో జర్నలిస్ట్గా పనిచేశారు. సంపత్ పెళ్లి చేసుకోలేదు.
కొంతకాలం స్వగ్రామంలోనే ప్రైవేటు ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. కొద్దిరోజుల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా కరీంనగర్లోని తెలంగాణ భవన్కు సీఎం కేసీఆర్ వచ్చిన సందర్భంలో సంపత్ కుమార్ అక్కడికి వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన్ను గుర్తుపట్టిన కేసీఆర్ దగ్గరికి పిలిచి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అక్కడున్న మంత్రులు,ఎమ్మెల్యేలకు సంపత్ను పరిచయం చేశారు. కలిసి చదువుకున్న రోజులను గుర్తుచేసుకుని సంతోషపడ్డారు.