జగిత్యాల జిల్లాలో మంత్రులకు చేదు అనుభవం.. కొప్పుల, ఎర్రబెల్లి షాక్..!
జగిత్యాల : జిల్లాలో ఇద్దరు తెలంగాణ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ పర్యటన కలకలం రేపింది. ఆ ఇద్దరు మంత్రుల కాన్వాయ్ను స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో గురువారం నాటి మంత్రుల జిల్లా పర్యటన చర్చానీయాంశంగా మారింది.
కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల కాన్వాయ్ను అడ్డుకుని నిరసన తెలిపారు. గురువారం నాడు హిమ్మత్ రావు పేట గ్రామానికి వెళ్లే తరుణంలో మంత్రులకు మార్గమధ్యంలో చేదు అనుభవం ఎదురైంది. రాంనగర్ చౌరస్తా దగ్గర కొండగట్టు ఆర్టీసీ ప్రమాద బాధితులు, కొందరు రైతులు వారిని అడ్డుకున్నారు.
ఆ టీఆర్ఎస్ నేతలు అటు వైపుగా.. కారు జోరుకు బ్రేకులేనా.. ఆ ప్రచారంలో నిజమెంత?
సరిగ్గా ఏడాది కిందట సెప్టెంబర్ 11వ తేదీన కొండగట్టు సమీపంలో జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడి 65 మంది చనిపోయారు. మరెంతోమందికి తీవ్ర గాయాలై నేటికి చికిత్స పొందుతున్నారు. పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడం ద్వారా ఆ బస్సు అదుపు తప్పి ప్రమాదం జరిగింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇంతవరకు పూర్తి స్థాయిలో అందలేదన్నది బాధిత కుటుంబాల ఆరోపణ.
ఆ క్రమంలో జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులను అడ్డుకున్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయి పరిహారం చెల్లించాలని నినదించారు. ఆరు కుటుంబాలకు ఇంకా పరిహారం ఇవ్వాల్సి ఉందని.. ఒక కుటుంబానికి ఉద్యోగం ఇస్తామన్న హామీ ఇంతవరకు నెరవేరలేదని ఆరోపించారు. దాదాపు 15 నిమిషాల పాటు మంత్రుల కాన్వాయ్ ముందుకు కదల్లేకపోయింది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని మంత్రులకు దారి క్లియర్ చేశారు.