పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. 4 నెలల నుంచి అన్నీ కష్టాలే.. అందుకేనా రాజీనామాలు..!
కరీంనగర్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడి చదువుతున్నారు. అయినా కూడా అనుకున్నంత స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంవత్సరాలకొద్దీ ప్రిపేర్ అవుతూ అటు నోటిఫికేషన్లు రాక.. ఇటు ఉద్యోగాలు దొరక్క అష్టకష్టాలు పడతున్నారు. ఆ క్రమంలో ప్రభుత్వ కొలువులో చేరిన కొందరు ఉద్యోగులు రాజీనామాల బాట పట్టడం చర్చానీయాంశమైంది.
లోక్సభ ఎన్నికలు ముగిసినా తెల్లారే.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. రాత్రికి రాత్రే అర్హుల జాబితా విడుదల చేయడంతో ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే సరైన శిక్షణ లేకుండా డైరెక్టుగా పోస్టులు కేటాయించడంతో ఇప్పుడు క్షేత్ర స్థాయిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయడం చర్చానీయాంశమైంది.
ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న సంబురం కూడా లేకపాయే..!
ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న సంబురం నాలుగు నెలలు కూడా నిలవలేదు. అరకొర పోస్టులకు పెద్దసంఖ్యలో అభ్యర్థులు పోటీపడితే.. అందులో విజయం సాధించి చివరకు ఉద్యోగం దక్కించుకుంటే.. ఆ ఆనందం కనీసం ఆరు నెలలైనా (ప్రైవేట్ సంస్థల్లో ప్రొబేషనరీ పీరియడ్) లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పోటీ పరీక్ష నిర్వహించింది. అందులో సెలక్టయిన అభ్యర్థులకు హడావిడిగా ఉద్యోగాలు ఇచ్చేసింది. ఆ మధ్య లోక్సభ ఎన్నికలు ఉండటంతో కోడ్ అమలైంది.
అయితే ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11 తర్వాత మరుసటి రోజే ఉన్నపళంగా అర్హుల జాబితాలో చోటు సంపాదించిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరాలని ఆదేశించింది ప్రభుత్వం. అదలావుంటే కొందరు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తుండటం హాట్ టాపికయింది.
పెద్ద సారును మరిచారా చిన్న సారూ.. తెలంగాణ సిద్దాంతకర్త జయంతి వేళ..!
వెతలే తప్ప వేతనాలు లేవుగా..!
ఉద్యోగాలైతే ఇచ్చారు కానీ వారికి ట్రైనింగ్ ఇవ్వడం మాత్రం మరిచిపోయారు అధికారులు. దాంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా కొలువుదీరినవారు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు పని వత్తిడి వల్ల ఉద్యోగం వచ్చిన సంబరం కూడా లేకుండా పోతోంది. ఇదివరకు కార్యదర్శులకు చెక్ పవర్ ఉండేది. కానీ కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఆ వెసులుబాటు తీసేశారు.
దాంతో కొత్తగా విధుల్లో చేరిన పంచాయతీ కార్యదర్శులకు ఇప్పుడు చెక్ పవర్ లేకుండా పోయింది. అంతేకాదు అప్పజెప్పిన బాధ్యతలతోనే సతమతమవుతుంటే.. అదనంగా హరితహారం, పారిశుధ్య నిర్వహణ, ఓడీఎఫ్, ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత వారికి మరింత భారంగా మారింది. అదలావుంటే సర్పంచులు, అధికార పార్టీ నేతలు వివిధ పనుల నిమిత్తం వత్తిడి పెంచడమే గాకుండా కొన్నిసార్లు దాడులకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కరీంనగర్ జిల్లాలో 12 మంది గుడ్బై
కరీంనగర్ జిల్లాలో మొత్తం 313 గ్రామ పంచాయతీలున్నాయి. అందులో 205 పంచాయతీలకు జూనియర్ కార్యదర్శులను నియమించింది ప్రభుత్వం. అయితే వారిలో 197 మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరారు. మిగతా 8 మంది మాత్రం వివిధ కారణాలతో ఉద్యోగాల్లో చేరలేదు. లోక్సభ ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11 మరుసటిరోజే అంటే ఏప్రిల్ 12న వారికి కొలువులు కట్టబెట్టింది సర్కార్. అయితే కార్యదర్శులుగా కొలువుదీరిన 197 మందిలో కొందరు రాజీనామా చేస్తుండటం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.
కొత్త పంచాయతీ రాజ్ చట్టంతో కార్యదర్శులకు బాధ్యతలు పెరిగాయి. దాంతో పాటు తీవ్రమైన పని వత్తిడితో సతమతమవుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం ట్రైనింగ్ కూడా ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయిలో కొందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదలావుంటే మూడేళ్ల వరకు ఉద్యోగ భద్రత లేకపోవడం.. జీతాలు కూడా తక్కువగా ఉండటం.. సరైన సమయానికి వేతనాలు రాకపోవడం.. రాజకీయ వత్తిళ్లు.. ఇలాంటి కారణాలతో తమ ఉద్యోగాలకు గుడ్బై చెబుతున్నారు కొందరు.
ఉద్యోగ భద్రత లేదు.. జీతం లేదు.. అందుకే రాజీనామాల పర్వం
జూనియర్ ప్రభుత్వ కార్యదర్శులు ఉద్యోగంలో చేరి నాలుగు నెలలు అవుతోంది. ఇంతవరకు వారికి జీతాలు చెల్లించలేదు ప్రభుత్వం. ఆ క్రమంలో ఈ ఉద్యోగాల్లో కొనసాగితే సేఫ్ జోన్లో ఉండబోమనే అనుమానంతో కొందరు రాజీనామాలు చేస్తున్నారు. ఒక కరీంనగర్ జిల్లాలోనే 12 మంది కార్యదర్శులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం హాట్ టాపికయింది. దీన్ని నమ్ముకుంటే లాభం లేదనుకుని గుడ్బై చెబుతున్నారు. ఆ క్రమంలో ఇటీవల విడుదల చేసిన ఎస్సై పోస్టుతో పాటు బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు కొందరు కార్యదర్శులు ఎంపికయ్యారు. దాంతో ఈ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆ పోస్టుల్లో చేరిపోయారు. త్వరలో విడుదల కానున్న గ్రూప్-2, కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాల తర్వాత మరికొందరు కార్యదర్శులు కూడా గుడ్బై చెప్పనున్నారనే టాక్ నడుస్తోంది.
కశ్మీర్ బిల్లును వ్యతిరేకించే నేతలు దేశద్రోహులే.. లోక్సభలో టీఆర్ఎస్ సంచలన వ్యాఖ్యలు
కార్యదర్శుల వెతలపై అప్పట్లో వన్ఇండియా కథనం
ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆ ఆనందం నాలుగు నెలలు కూడా నిలవకుండా పోయింది. కొలువు వచ్చిందని సంబరపడ్డారే గానీ.. తీరా కొలువులో చేరాక గానీ తిప్పలు తెలియడం లేదు. ఇప్పటివరకు జీతాలు లేక.. పని వత్తిడితో సతమతమవుతూ రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఇదివరకు జూన్ చివరివారంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వెతలకు సంబంధించి.. "పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. ట్రైనింగ్ మరిచారు, జీతాల్లేవు.. ఆ పోస్టుతో తిప్పలెన్నో" అంటూ వన్ఇండియా తెలుగు ఓ కథనం కూడా ప్రచురించింది.