పిచ్చోళ్ల మాటలు పట్టిచ్చుకోం.. ప్రాజెక్టు ఎలా నింపుతారో తెలియని దద్దమ్మలు..
తెలంగాణను కరువు నుంచి శాశ్వతంగా విముక్తి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కంట్రిబ్యూషన్ కింద.. ఎస్ఆర్ఎస్పీతో సంబంధం లేకుండా సుమారు 60 టీఎంసీల నీటిని విజయవంతంగా లిఫ్ట్ చేసిన సందర్భంగా సోమవారం ఆయన మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అంతకుముందు ఆయన కుటుంబీకులతో కలిసి వేములవాడ రాజన్న సన్నిధిలో పూజలు నిర్వహించారు.
ఇక వర్షాలు కురవకున్నా సాగు ఆగదు
నీటిని ఎత్తిపోయడంతో మిడ్ మానేరు, లోయర్ మానేరు రిజర్వాయర్లు నిండుకున్నాయని, దీంతో ఎస్ఆర్ఎస్పీతో సంబంధం లేకుండానే రెండు పంటలు పండించ్చుకోవచ్చని, ఇకపై వర్షాలు కురవకున్నా జిల్లాలో సాగు ఆగదని సీఎం చెప్పారు. తెలంగాణలో జీవనది గోదావరి పారే జిల్లాల్ని సస్యశామలం చేస్తామని గతంలోనూ చెప్పామని, టార్గెట్ చాలా వరకు సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
జూన్ తర్వాత అసలు సీన్ చూస్తారు
తెలంగాణను ఎక్స్ రే కండ్లతో పరిశీలించి, ఎక్కడ ఏం ఆ పనులు చేపట్టామని సీఎం గుర్తుచేశారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ బ్యారేజీలు అన్ని కలిపి కరీనంగర్ లో గోదావరి పారే 145 కిలోమీటర్ల దూరం 365 రోజులు సజీవంగా ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1230 చెక్డ్యాంలకు అనుమతులిస్తే.. అందులో ఎక్కువభాగం కరీంనగర్ జిల్లా కే కేటాయించామన్నారు. గతంలో కరువు కాటకాలకు మారుపేరుగా ఉన్న కరీంనగర్ జిల్లా స్వరూపం పూర్తిగా మారబోతున్నదని తెలిపారు.
సన్నాసుల్ని పట్టించుకోం
కరీంనగర్ జిల్లాలో సుమారు 180 కిలోమీటర్లు ప్రవహించే మానేరు నదికి మహార్దశ కల్పిస్తామని, రూ. 440 కోట్లతో మానేరు చెక్ డ్యాంలు, సుమారు రూ.40 కోట్లతో మూలవాగు చెక్డ్యాంలు పూర్తిచేస్తామని కేసీఆర్ చెప్పారు. ‘‘లండన్ నగరంలో థేమ్స్ లాగా మానేరు కూడా సజీవంగా ఉంటుందని గతంలో నేనన్న మాటల్ని కొందరు సన్నాసులు ఎగతాళి చేశారు. నేను చెప్పింది నిజమో కాదో జూన్ తరువాత ఆ సన్నాసులకే తెలుస్తుంది. ప్రాజెక్టులు కట్టాలని మమ్మల్ని ఎవరూ అడగలేదు. ఉద్యమపార్టీగా బాధ్యత తీసుకుని పనిచేశాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయను విజయవంతంగా పూర్తిచేశాం. ప్రాజెక్టులపై అవగాహన లేకుండా కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు పిచ్చోళ్లలాగా మాట్లాడుతున్నారు. ప్రాజెక్టుల్ని ఎలా నింపుతారో కూడా తెలియనివాళ్ల మాటల్ని మేం పట్టించుకోం''అని సీఎం కేసీఆర్ చెప్పారు.