YS Sharmila: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో: టీఆర్ఎస్ కంచుకోటలో ఎంట్రీ
కరీంనగర్: ఇంకొద్దిరోజుల్లో తెలంగాణలో తన రాజకీయ అరంగేట్రాన్ని అధికారికంగా ప్రకటించడానికి సమాయాత్తమౌతోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. తన జిల్లాల పర్యటను మరింత విస్తృతం చేశారు. ఇటీవలే వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో పర్యటించిన ఆమె- తాజాగా కరీంనగర్లో పర్యటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనను ఈ ఉదయం ప్రారంభించారు. హైదరాబాద్ జుబ్లీహిల్స్లోని లోటస్పాండ్ నివాసం నుంచి బయలుదేరారు. షెడ్యూల్ ప్రకారం ఈ మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్కు చేరుకోవాల్సి ఉంది.
ఈ సారి వైఎస్ షర్మిల.. చేనేత కార్మికులను కలుసుకోనున్నారు. వారి కష్టాల గురించి తెలుసుకోనున్నారు. అలాగే- కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఒంటిమామిడి, ప్రజ్ఙాపూర్, సిద్దిపేట్, సిరిసిల్ల, అల్మాస్పూర్, వేములవాడ బైపాస్ మీదుగా కరీంనగర్కు చేరుకుంటారు. వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్టీపీ నాయకులు, సానుభూతిపరులు దారి పొడవునా స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి, నివాళి అర్పిస్తారు. ప్రజ్ఞాపూర్, సిద్ధిపేట్, సిరిసిల్ల.. ఈ మూడు నియోజకవర్గాలు కూడా టీఆర్ఎస్కు కంచుకోటల్లాంటివే.
ఈ ఉదయం 8:30 గంటలకు ఒంటిమామిడి, 8:45 నిమిషాలకు ప్రజ్ఞాపూర్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి, నివాళి అర్పిస్తారు. కొద్దిసేపు స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 9:30 గంటలకు సిద్ధిపేట్కు చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు విరామం తీసుకుంటారు. అనంతరం 10:30 గంటలకు సిరిసిల్ల చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అల్మాస్పూర్కు వెళ్తారు. చేనేత కార్మికుడు శ్రీధర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మళ్లీ సిరిసిల్లకు చేరుకుని, వేములవాడ బైపాస్ మీదుగా కరీంనగర్కు వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు భోజనం అనంతరం తన పర్యటన ప్రారంభిస్తారు.
వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని జులై 8వ తేదీన వైెఎస్సార్ తెలంగాణ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి వైఎస్ షర్మిల సమాయాత్తమౌతోన్న విషయం తెలిసిందే. పార్టీ విధి విధానాలను ఆమె ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో- జిల్లాల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించడానికి ఆమె పర్యటనలను చేపట్టారు. ఇదివరకు మెదక్, ఆ తరువాత వికారాబాద్, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో పర్యటించారు. ఉద్యోగాల నోటిఫికేషన్, రైతాంగ సమస్యలను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సారి చేనేత కార్మికుల వెతలను తెలుసుకోవడానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటనను ప్రారంభించారు.