మస్కట్ లో మనోళ్ల కష్టాలు.. జీతాల్లేవు, తిండి లేదు.. సర్కార్ సాయం కోసం ఎదురుచూపు
కరీంనగర్ : ఉన్న ఊరిలో ఉపాధి లేదు. సొంత రాష్ట్రంలో ఉద్యోగం లేదు. జీవన పోరాటంలో.. బతుకు గమనంలో గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను మంచిగా చూసుకోవాలనే తాపత్రయంతో విదేశాల బాట పడుతున్న తెలుగోడి పరిస్థితి దయనీయంగా మారుతోంది. దేశం కాని దేశంలో దుర్భర పరిస్థితులు అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఏజెంట్ల మోసాలు ఓవైపు, సరిగా జీతాలివ్వక సతాయించే కంపెనీలు మరోవైపు, ఇలా జీవనోపాధి వెతుక్కుంటూ సప్త సముద్రాలు దాటుతున్నా.. గవ్వ ఆదాయం లేక గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన దయనీయ పరిస్థితి మనోళ్లది.
గల్ఫ్ కష్టాలు
ఉపాధి కోసం దేశం కాని దేశంకు వెళుతున్న తెలుగు కార్మికులు మోసపోతూనే ఉన్నారు. ఏజెంట్ల మోసాలకు తోడు అక్కడి కంపెనీలు ప్రవర్తించే తీరు మనోళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మంచి జీతం వస్తదంటూ కోటి ఆశలతో విమానమెక్కుతున్న వారికి నిరాశే మిగులుతోంది. ఒమన్ దేశంలోని హసన్ జుమ్మ బ్యాకర్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ తెలుగు కార్మికులను ముప్పుతిప్పలు పెడుతోంది. 8 నెలలుగా జీతాలివ్వకుండా సతాయిస్తోంది.
దీనావస్థ..!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన దాదాపు 560 మంది కార్మికులు ఈ కంపెనీ కోసం పనిచేస్తున్నారు. అందులో తెలంగాణకు చెందినవారు 300 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందినవారు. 2018, సెప్టెంబరులో వీరి వీసా, లేబర్ కార్డు గడువు అయిపోయింది. వీసా రెన్యూవల్ చేయాల్సిన కంపెనీ చేతులెత్తేసింది. అంతేకాదు 8 నెలల నుంచి ఇప్పటివరకు జీతాల ఊసే లేదు. వీసా గడువు ముగిసి చాలాకాలం కావడంతో వారంతా క్యాంపుల్లో ఉండాల్సిన పరిస్థితి. చేతిలో చిల్లిగవ్వ లేక నానా తిప్పలు పడుతున్నారు.
అత్యాచార నిందితులు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే!
తిండి లేక తిప్పలు
జీతాలివ్వక, తిండి పెట్టక కంపెనీ యజమానులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రతినిధితో గోడు వెళ్లబోసుకున్నారు. అలా వీరి గల్ఫ్ కష్టం వెలుగుచూసింది. జీతాల గురించి అప్పుడు ఇప్పుడంటూ దాటవేస్తున్నారని, కనీసం తిండి కూడా పెట్టడం లేదని వాపోయారు. కొంతమంది దాతల సాయంతో ఆకలి తీరుతోందని.. కానీ అక్కడకు వెళ్లేందుకు చేసిన అప్పులకు వడ్డీ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు కంపెనీ మీద అక్కడి పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు
ఒమన్ లో బందీలుగా మారిన కార్మికులు దీనావస్థలో మగ్గుతున్నారు. వీరికి చెందిన పాసుపోర్టులు కూడా కంపెనీ యజమానుల దగ్గరే పెట్టుకున్నారు. లేబర్ కార్డు గడువు ముగియడంతో బయట తిరగలేని పరిస్థితి. అందుకే క్యాంపుల్లోనే కాలం వెల్లదీస్తున్నారు.
దేశం కాని దేశంలో తిప్పలు పడుతున్న తెలుగు కార్మికులు.. తిరిగి ఇండియాకు రావాలంటే ఒక్కొక్కరు దాదాపు లక్ష రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుందట. లేబర్ కార్డు వీసా లేనందువల్ల నెలకు 35 రియాళ్ల ఫైన్ వేస్తారట. దానికి తోడు విమాన ఛార్జీలకు సైతం డబ్బులు కావాలి. ఆ క్రమంలో స్వదేశానికి తాము తిరిగివచ్చేలా ప్రభుత్వాలు సాయం చేయాలని వేడుకుంటున్నారు.