ఆయన రాజ్యసభ పేదోడా?.. కేసీఆర్ 'సంతోషా' నికి మిడ్ మానేరు భూములా?
కరీంనగర్ : రాజ్యసభలో పేదోళ్లుంటారా.. దారిద్ర్య రేఖకు దిగువన కుటుంబాలకు పెద్దల సభలో ఛాన్స్ దొరుకుతుందా? వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏముంది అనే రీతిలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీకి ఆ భూములు కట్టబెట్టారా? కోట్ల రూపాయలు ఆర్జించి సంఘంలో పెద్దోడిగా చలామణీ అవుతున్న ఎంపీని అధికారులు పేదోడిగా గుర్తించారా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు మిడ్ మానేరు ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీలో పేదోళ్ల స్థానంలో పెద్దోళ్లు కర్చీఫ్ వేశారనే ఆరోపణలు సమాధానంగా కనిపిస్తున్నాయి.
పునరావాసం ఎవరికి.. పేదోళ్లకా, పెద్దోళ్లకా?
మిడ్ మానేరు ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీలో పేదోళ్లను మరిచి పెద్దోళ్లకు భూములు కట్టబెడుతున్నారనే ఆరోపణలు జోరందుకున్నాయి. నిబంధనలను అతిక్రమిస్తూ అనర్హులకు భూములు కట్టబెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, ఆయన సోదరితో పాటు మరో బంధువుకు అప్పనంగా భూములు కేటాయించారని నిర్వాసితులు మండిపడుతున్నారు.
మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన పేదల కోసం ఉద్దేశించిన పునరావాస ప్యాకేజీ దారి తప్పుతోందనేది నిర్వాసితుల వాదన. దారిద్ర్య రేఖకు దిగువన (Below Poverty Line) ఉన్న కుటుంబాలకు ఇవ్వాల్సిన భూముల్ని పెద్దోళ్లు గద్దల్లా తన్నుకుపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
వామ్మో.. రాస 'మోహన' లీలలు.. గుంటూరు ఫారెస్ట్ అధికారి కేసులో సంచలన నిజాలు
ఎంపీపై అధికారుల ప్రేమ.. పేదోడిగా గుర్తించడంపై నిర్వాసితుల ఆగ్రహం
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్పై ప్రేమ కురిపించిన అధికారులు అతడిని పేదోడిగా గుర్తించారని ఫైరవుతున్నారు నిర్వాసితులు. అతడికి కొదురుపాకలోని సర్వే నెంబర్ 317లో 242 గజాల స్థలం కేటాయించడం వివాదస్పదమైంది. అంతేకాదు ఆయన సోదరి జోగినిపల్లి సౌమ్యకు కూడా అదే సర్వే నెంబర్లో మరో 242 గజాల స్థలం కేటాయించారని.. వారి సమీప బంధువు గండ్ర రమణారావుకు సర్వే నెంబర్ 366లో 242 గజాల స్థలం కేటాయించడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు.
మిడ్ మానేరు ప్రాజెక్టు పునారావాసం కింద.. మంచి స్థాయిలో ఉన్న ఆ ముగ్గురిని బీపీఎల్ కింద పరిగణిస్తూ భూములు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని వాపోతున్నారు నిర్వాసితులు.
అధికారుల అత్యుత్సాహం.. పైరవీకారులకే న్యాయం?
నిబంధనలు తుంగలో తొక్కిన అధికారులు.. ఆ ముగ్గురికి భూములు కేటాయించి అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపిస్తున్నారు. అసలు రూల్స్ ప్రకారం 2008 సంవత్సరానికి ముందు మూడేళ్ల నుంచి గ్రామంలో నివసించకుంటే పునరావాస ప్యాకేజీ వర్తించదని గుర్తు చేస్తున్నారు. సంతోష్ కుమార్ హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరుచుకుని చాలా ఏళ్లయిందని.. అయినా అదేమీ పట్టించుకోకుండా అధికారులు ఇలా పునరావాస ప్యాకేజీలో ఆయనకు చోటు కల్పించారని మండిపడుతున్నారు.
అదలావుంటే పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయిన మహిళలకు పునరావాస ప్యాకేజీ వర్తించదని చెబుతున్న అధికారులు.. సంతోష్ కుమార్ సోదరి సౌమ్యకు మాత్రం అందులో చోటు కల్పించడం న్యాయమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ముగ్గురికే కాదు పైరవీ చేసుకున్నోళ్లకు పునారావాస ప్యాకేజీలో భాగంగా అధికారులు భూములు కేటాయిస్తున్నారని.. అసలైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.