TSRTC STRIKE:కరీంనగర్ సీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. సంజయ్ను తోసిన ఏసీపీ, చొచ్చుకెళ్లేందుకు యత్నం..
కరీంనగర్ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు చౌరస్తా వద్ద ఎంపీ బండి సంజయ్ ఆందోళన చేపట్టారు. అయితే ఎంపీతో ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో అక్కడే సంజయ్ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆరాతీశారు. ఏం జరిగిందో తెలియజేయాలని నివేదిక కోరారు.
ఎంపీతో ఏసీపీ అనుచితంగా ప్రవర్తించడాన్ని బీజేపీ శ్రేణులు సీరియస్గా తీసుకున్నారు. కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాహసన్ రెడ్డి కార్యాలయం వద్దకొచ్చారు. చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసు ఉన్నతాధికారులు కలుగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
డ్రైవర్ బాబు మృతిని నిరసిస్తూ శుక్రవారం కరీంనగర్ బంద్కు బీజేపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిర్ణయం తీసుకుంది. బీజేపీ ఇచ్చిన బంద్కు ఇతర పక్షాలు కూడా మద్దతు తెలిపాయి. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు దీక్షకు బ్రేక్నిచ్చారు.
వాస్తవానికి శుక్రవారం మధ్యాహ్నం వరకు దీక్ష చేయాలి కానీ.. బీజేపీ బంద్ నేపథ్యంలో అర్థాంతరంగా గురువారమే దీక్షను విరమించారు. ఛలో కరీంనగర్కు పిలుపునిచ్చి విజయవంతం చేశారు.