TSRTC Strike: ఆర్టీసీ కార్మికుడి నుంచి అద్దె తీసుకోనంటూ ఇంటి యజమాని, ప్రశంసలు
కరీంనగర్: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. 28 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులకు రాజకీయ పార్టీలతోపాటు ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి.
అద్దె తీసుకోను..
కాగా, ఓ ఇంటి యజమాని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా చేసిన పని ఇప్పుడు ప్రశంసలందుకుంటోంది. సమ్మెలో ఉంటూ ఆర్టీసీ కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కరీంనగర్ సుభాష్నగర్కు చెందిన విశ్రాంత ఉద్యోగి శీలం శంకర్ మానవత్వం చాటుకున్నారు.
ఇంటి యజమానిపై నెటిజన్ల ప్రశంసలు
సమ్మె ముగిసేదాకా తన ఇంట్లో అద్దెకు ఉండే ఆర్టీసీ కార్మికుడి నుంచి డబ్బులు తీసుకోబోనంటూ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఆ పోస్టుకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఆ ఇంటి యజమానిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారంటూ అభినందిస్తున్నారు.
కాగా, హైదరాబాద్లో జరిగిన సకల జనుల సమరభేరీలో పాల్గొన్న అనంతరం కరీంనగర్ కు చెందిన బాబు అనే డ్రైవర్ గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో రాజకీయా పార్టీలు, ఆర్టీసీ కార్మికులు కరీంనగర్లో బంద్ నిర్వహించి, భారీ నిరసనల చేపట్టారు.
ఆగని ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు..
సమ్మె కొనసాగుతున్న క్రమంలో ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. గత 28వ రోజులుగా సమ్మె చేయడంతో కార్మికులు ఊపిరి తీసుకుంటున్నారు. ఇప్పటికే 17 మంది డ్రైవర్లు, కండక్టర్లు చనిపోయారు. గురువారం సాయంత్రం ప్రకాశ్ అనే కండక్టర్ కూడా గుండెపోటుతో నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం మరో డ్రైవర్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. కార్మికుల ఆత్మహత్యలు కలవరానికి గురిచేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ డిపోకు చెందిన తాత్కాలిక డ్రైవర్ ఖాజా ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందుతాగాడు. వెంటనే అతనిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఖాజాకు చికిత్స అందిస్తున్నారు. ఖాజా స్వస్థలం నాగర్ కర్నూలు కాగా.. షాద్ నగర్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మహత్య చేసుకుంటుండగా.. తాత్కాలిక డ్రైవర్ కూడా ఆత్మహత్యాయత్నం చేయడం చర్చనీయాంశమైంది.