రిమాండ్ రిపోర్ట్: సంచలన విషయాలు వెల్లడి, ముందుగానే సిమ్ కొనుగోలు, ప్లాన్ ప్రకారం బిట్టు శ్రీను
న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వామన్రావు హత్యకు నాలుగు నెలల క్రితమే ప్లాన్ చేసినట్లు అతడు వెల్లడించాడు. అడ్వకేట్ వామన్రావు బతికి ఉంటే తమకు ఎన్నటికైనా సమస్యే అని భావించి కుంట శీనుతో కలిసి హత్యకు పథకం రచించామని పేర్కొన్నాడు.
బిట్టు శ్రీనుకు సంబంధించిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టుపై వామన్రావు గతంలో అనేక కేసులు వేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు పెరిగాయి. నాలుగు నెలల క్రితం తమ స్వగ్రామం గుంజపడుగులోనే పాత స్కూల్ బిల్డింగ్ నుంచి రెక్కీ నిర్వహించి.. హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో జనం ఎక్కువ ఉండటంతో వారి పన్నాగం విఫలమైంది. 17వ తేదీన పక్కాగా ప్లాన్ చేసిన దుండగులు.. వామన్రావు ఒంటరిగా దొరకడంతో ఆయనతో పాటు భార్యను కూడా హతమార్చారు. చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత కుంట శీను, బిట్టు శ్రీనుకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
అతడిని మహారాష్ట్రకు పారిపొమ్మని బిట్టు శ్రీను సలహా ఇచ్చాడు. రెండు రోజులు ఇంట్లోనే మకాం వేశాడు. హత్యకు ముందు వేరే సిమ్ కొనుగోలు చేసిన బిట్టు శ్రీను వాటి ద్వారానే తన భాగస్వాములతో చర్చలు జరిపినట్లు సమాచారం.