కరీంనగర్ బరి..! పొన్నం, బండి, బోయినపల్లి.. గెలిచేదెవరు మరి?
కరీంనగర్ : ఉత్తర తెలంగాణలో కరీంనగర్ లోక్సభ కీ సెగ్మెంట్. తెలంగాణలోని పార్లమెంటరీ స్థానాల్లో కరీంనగర్ సెగ్మెంట్ కు ప్రత్యేకత ఉంది. ఎం.సత్యనారాయణ, జువ్వాడి చొక్కారావు, సిహెచ్ విద్యాసాగర్ రావు (ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్), కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి) లాంటి మహామహులు కరీంనగర్ స్థానం నుంచి ఎంపీలుగా గెలుపొందారు.
ఇల్లిల్లు తిరుగుడేంది భాయ్..! స్టైల్ మారిన ప్రచారం.. ఓటర్లకు గాలం
1952లో ఏర్పడ్డ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం మొదట్లో కాంగ్రెస్ కు కంచుకోటలా ఉండేది. మధ్యలో టీడీపీ సత్తా చాటింది. ఆ తర్వాత బీజేపీ ఉనికి చాటుకుంది. తెలంగాణ ఉద్యమంతో ప్రజలకు చేరువైన టీఆర్ఎస్ పార్టీ 2004 నుంచి హవా కొనసాగిస్తోంది. అయితే 2009లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చేతిలో టీఆర్ఎస్ కు పరాభవం మిగిలింది. తిరిగి 2014లో టీఆర్ఎస్ తన ఆధిక్యం నిలుపుకోవడంతో బోయినపల్లి వినోద్ కుమార్ ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. అదలావుంటే టీఆర్ఎస్ కు కలిసొచ్చిన జిల్లాగా కరీంనగర్ ను సెంటిమెంట్ గా భావిస్తారు సీఎం కేసీఆర్.
ముగ్గురూ ముగ్గురే.. గెలిచేది ఎవ్వరే..!
2019 లోక్సభ ఎన్నికలకు గాను కరీంనగర్ స్థానం నుంచి.. టీఆర్ఎస్ పక్షాన సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్కుమార్ బరిలో నిలిచారు. అయితే పొన్నం ప్రభాకర్ గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. అలా వినోద్ కుమార్, పొన్నం ప్రభాకర్ కు పార్లమెంటులో తమ గళం వినిపించిన అనుభవముంది. అయితే బీజేపీ నుంచి ఈసారి బరిలో నిలిచిన బండి సంజయ్ ఇంతవరకు ప్రజాప్రతినిధిగా గెలవలేదు. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీలో అగ్రనేతలను తోసిరాజని అత్యధికంగా దాదాపు 66 వేల ఓట్లు సాధించడం విశేషం.
కరీంనగర్ లోక్సభ స్థానంలో 16 లక్షల 32 వేల 824 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 8 లక్షల 7 వేల 233 మంది ఉండగా.. మహిళలు 8 లక్షల 25 వేల 565 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇతరులు 26 మందికి ఓటు హక్కుంది.
మరోసారి.. బోయినపల్లి కన్ను
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పనితీరు, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తన విజయానికి దోహదపడతాయంటున్నారు బోయినపల్లి వినోద్ కుమార్. 2014 టర్మ్ లో గెలిచిన టీఆర్ఎస్ ఎంపీలు.. కేంద్రాన్ని ఒప్పించి అభివృద్ధి కార్యక్రమాలు స్పీడప్ చేశారని చెబుతున్నారు. సెంట్రల్ లో టీఆర్ఎస్ కు మెజార్టీ ఉంటే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించొచ్చని ప్రచారంలో వివరిస్తున్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదంటున్నారు వినోద్ కుమార్. కరీంనగర్ నుంచి బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ప్రభావం వార్డుల వరకే పరిమితంగా ఉంటుందని.. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినంతగా ఓట్లు రాలవంటున్నారు. అందువల్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు అసలు తనకు పోటీయే కాదనే ధీమాతో ఉన్నారు.
స్థానికుడిని.. నాకే ఓట్లు..!
టీఆర్ఎస్, బీజేపీపై తనదైన శైలిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. స్థానికుడిని కావడంతో కరీంనగర్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. 2009-14 మధ్యకాలంలో ఎంపీగా సాధించిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో పోషించిన కీలకపాత్ర తన విజయానికి కారణమవుతాయన్నారు.
పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా.. కరీంనగర్ ఓటర్లు తనను గెలిపిస్తారని ఆశతో ఉన్నారు పొన్నం. కరీంనగర్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసే వ్యక్తిగా తనను ఆదరిస్తారనే నమ్మకంతో బరిలో నిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వచ్చిన వ్యతిరేకతే.. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుందని అభిప్రాయపడ్డారు.
బండి.. గెలిచేనా ఈసారి?
కరీంనగర్ ఓటర్లు ఈసారి సైలెంట్ ఓటింగ్ తో విలక్షణమైన తీర్పు ఇస్తారనే అభిప్రాయం వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్. మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్న ప్రజానీకం.. ఆ మేరకు కరీంనగర్ నుంచి తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే స్వయంగా మోడీని, కేంద్రమంత్రులను నేరుగా కలిసి నిధులు తెచ్చే అవకాశముందన్నారు. టీఆర్ఎస్ నేతలను గెలిపిస్తే.. వారు సీఎం కేసీఆర్నే కలిసే పరిస్థితి లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే టీఆర్ఎస్కు వేసినట్లే అంటున్నారు బండి. రెండుసార్లు అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయిన క్రమంలో.. తనపై ప్రజల్లో సానుభూతి కనిపిస్తోందన్నారు. ఇదివరకు కాంగ్రెస్, టీఆర్ఎస్కు అవకాశమిచ్చినందున ఈసారి తనను గెలిపిద్దామనే ఆలోచన ప్రజల్లో కనిపిస్తోందన్నారు.
ఒకప్పుడు కాంగ్రెస్ ఇలాకా..! ఇప్పుడేమో టీఆర్ఎస్ హవా
కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్ లో 7 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. కరీంనగర్ (జనరల్), వేములవాడ (జనరల్), సిరిసిల్ల (జనరల్), హుజురాబాద్ (జనరల్), హుస్నాబాద్ (జనరల్), చొప్పదండి (ఎస్సీ), మానకొండూర్ (ఎస్సీ) స్థానాలున్నాయి. 1952లో తొలిసారిగా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి.
1957-1962 నుంచి 1991-1996 వరకు దాదాపు నాలుగు దశాబ్ధాలు కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా విజయపరంపర కొనసాగించింది. 1971-77 టర్మ్ లో ఎం.సత్యనారాయణ రావు తెలంగాణ ప్రజా సమితి నుంచి గెలిచారు. అనంతరం కాంగ్రెస్ లో కొనసాగారు. ప్రస్తుతం 16వ లోక్సభ కొలువుదీరినప్పటికీ.. కరీంనగర్ పార్లమెంటరీ స్థానానికి 18 సార్లు ఎలక్షన్లు జరిగాయి.
ఓటర్ల నాడి పట్టడం కష్టమే..!
కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ లో ఓటర్ల నాడి పసిగట్టడం అంతా ఈజీ కాదంటారు విశ్లేషకులు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయనే చందంగా ఉంటుందట ఇక్కడి ఓటర్ల తీర్పు. ఈసారి పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా 2014 నాటి సీన్ క్రియేట్ చేసేలా టీఆర్ఎస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ కూడా లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రెండు పార్టీలకు తోడు కేంద్రంలో అధికారపీఠంపై ఉన్న బీజేపీ కూడా 2019 ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. ఈనేపథ్యంలో కరీంనగర్ సెగ్మెంట్ లో త్రిముఖ పోటీ నెలకొంది.